తెలంగాణ

telangana

నదుల అనుసంధానానికి తెలంగాణ ససేమిరా.. 'నీటి లభ్యత తేల్చాకే ముందుకు నడవాలి'

By

Published : Oct 18, 2022, 10:23 PM IST

గోదావరిలో ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత తేల్చాకే నదుల అనుసంధానం, నీటి మళ్లింపు ఆలోచన చేయాలని తెలంగాణ రాష్ట్రం మరోమారు స్పష్టం చేసింది. గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య పది రాష్ట్రాలతో జాతీయ జల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ బెంగళూరు నుంచి సమావేశం నిర్వహించారు. హైబ్రిడ్ మోడ్‌లో జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

National Water Development meeting
National Water Development meeting

గోదావరిలో ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత తేల్చాకే నదుల అనుసంధానం, నీటి మళ్లింపు ఆలోచన చేయాలని తెలంగాణ రాష్ట్రం మరోమారు స్పష్టం చేసింది. గోదావరి - కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య పది రాష్ట్రాలతో జాతీయ జల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ బెంగళూరు నుంచి సమావేశం నిర్వహించారు. హైబ్రిడ్ మోడ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ నారాయణరెడ్డితో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరి, ఒడిషా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.

నీటి లభ్యత తేల్చాకే మళ్లింపు ఆలోచన: వర్చువల్ విధానంలో పాల్గొన్న తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్.. రాష్ట్రం అభ్యంతరాలను వివరించారు. గోదావరిలో ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యతను తేల్చాకే మళ్లింపు ఆలోచన చేయాలని.. తెలంగాణ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల కింద నీటి అవసరాలున్నాయని.. సమ్మక్క ఆనకట్ట అనుసంధానానికి సరిపోదని అన్నారు. సమ్మక్క సరిపోకపోతే ఇచ్చంపల్లి అని సూచించడం సరికదాని వ్యాఖ్యానించారు.

బేడితి - వరదా అనుసంధానంలో తెలంగాణ వాటా తేల్చాలి: గోదావరి - కావేరీ అనుసంధానికి సంబంధించిన సవివర అలైన్‌మెంట్ ప్రతిపాదన అందించాలని ఎన్‌డబ్ల్యూడీఏను కోరారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లో వేశాక కృష్ణా పరివాహకంలో ఉన్న రాష్ట్ర అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చాల్సి ఉంటుందని.. ప్రస్తుత ప్రతిపాదనలో ఆ వివరాలు లేవని మురళీధర్ పేర్కొన్నారు. కర్నాటకలో తుంగభద్ర ఎగువన చేపడుతున్న బేడితి - వరదా అనుసంధానంలో 18 టీఎంసీల్లో తెలంగాణకు వచ్చే వాటా తేల్చాలని కోరారు.

గోదావరిలో మిగులు జలాలు లేవన్న కేంద్ర జలఅభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్..ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని వాటా నీటిని ఇప్పుడు మళ్లిస్తామని తెలిపారు. నదుల అనుసంధానంలో భాగస్వామ్య రాష్ట్రాలు కలసిరావాలని, అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే ఐదేళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. అనుసంధానంతో దిగువ రాష్ట్రమైన తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, తమ హక్కులు కాలరాయొద్దని ఏపీ అధికారులు కోరారు. తమ అపోహలు నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఛత్తీస్‌గఢ్‌ వాదన: పోలవరం నుంచి వైకుంఠపురం, సాగర్, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ద్వారా సోమశిల నుంచి కావేరి నదికి నీటిని తరలిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎపీ.. కరవు పీడిత రాయలసీమకు కూడా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి జలాల్లో తమ వాటా నీటిని మళ్లించవద్దని ఛత్తీస్‌గఢ్‌ అనుసంధాన ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వాటాను పూర్తిగా వినియోగించుకుంటామని, సమ్మక్క ఆనకట్ట విషయంలో ఇప్పటికే తమకు వివాదాలు ఉన్నాయని పేర్కొంది. వాటాను వినియోగించుకునేందుకు ఛత్తీస్‌గడ్‌కు 20 ఏళ్లు పడుతుందని తేల్చిచెప్పారు.

ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాలు ఫలాలు పొందుతాయని జాతీయ జలఅభివృద్ధి సంస్థ పేర్కొంది. ఆ లోగా మహానది, గోదావరి అనుసంధానం కూడా పూర్తవుతుందని,ఛత్తీస్‌గఢ్‌ వినియోగాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేసింది. అనుసంధానంలో తమకు మొదట 230 టీఎంసీలు ఇస్తామని చెప్పారని, క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు కేవలం 38 టీఎంసీలకు కుదించారని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది.

శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటి అవసరాలు ఇచ్చే 17 టీఎంసీలను ఈ వాటా జమ చేయవద్దని కోరారు. అనుసంధానానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరారు. తమకు 9.8 టీఎంసీలు మాత్రమే కేటాయించడం సరికాదని కర్ణాటక తెలపగా.. కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details