తెలంగాణ

telangana

Central Team in Kadapa : కడప జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన.. వరద నష్టాల అంచనా

By

Published : Nov 28, 2021, 10:52 AM IST

Central Team in Kadapa : ఏపీలోని కడప జిల్లా రాజంపేట, నందలూరు పరిధిలో వరదతో.. ప్రాణ, ఆస్తి నష్టాలకు అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రవాహ ఉద్ధృతే కారణమని కేంద్ర బృందానికి ఆ రాష్ట్ర అధికారులు వివరించారు. ప్రాజెక్టు సామర్థ్యం కన్నా ఎక్కువగా.. ఎగువ నుంచి నీరు దూసుకొచ్చిందని నివేదించారు. తిరుపతి పరిధిలోనూ మరో 2 బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు పర్యటించాయి.

Central Team At Kadapa, కడప వరద ప్రాంతాల్లో కేంద్ర బృందాలు
Central Team At Kadapa

Central Team At Kadapa : ఏపీలోని కడప జిల్లాలో భారీ వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం శనివారం జిల్లాలో పర్యటించింది. ముందుగా పులపుత్తూరు గ్రామం వెళ్లిన అధికారులు.. చెయ్యేరునది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ప్రవాహం గురించి జిల్లా కలెక్టర్ విజయరామరాజును అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం, కూలిన ఇళ్లపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన పరిశీలించారు. పులపుత్తూరు నుంచి మందపల్లి చేరుకొని అక్కడ కోతకు గురైన ప్రాంతాలు, దెబ్బతిన్న పంట పొలాల వివరాలు తెలుసుకున్నారు. మందపల్లిలో 10 వేల బస్తాల ధాన్యం నీటిపాలైందని కేంద్ర బృందానికి రైతులు వివరించారు.

మట్టికట్ట తెగిపోవడానికి కారణమేంటి?

Central Team inspects crop damage in kadapa: మందపల్లి నుంచి అధికారులు.. అన్నమయ్య జలాశయ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాజెక్టులో ప్రవాహం తగ్గిపోవడం వల్ల కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టికట్ట తెగిపోవడానికి కారణమేంటని ఏపీ అధికారులను ప్రశ్నించారు. పింఛ జలాశయం కోతకు గురవడం వల్ల ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో ప్రవాహం పెరిగిందని అధికారులు వివరించారు. జలాశయం గేట్ల పైనుంచి ప్రవాహం ఉబకడం వల్లే మట్టికట్ట తెగిందన్నారు. పదేళ్లలో అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రవాహ వివరాలు, జలాశయం సామర్థ్యం, లోటుపాట్లపైనా కేంద్ర బృందం ఆరా తీసింది.

కడప ఆర్​ అండ్ బీ అతిథి గృహంలో కేంద్ర బృందం సభ్యులు వరద ప్రభావిత ప్రాంతాల ఫోటో ప్రదర్శన తిలకించారు. తర్వాత బుగ్గవంక, కమలాపురం దగ్గర దెబ్బతిన్న పాపాఘ్నినది వంతెన దగ్గరకు వెళ్లారు. జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా .. 12 వందల 21 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్ర బృందానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు.

మరో రెండు కేంద్ర బృందాలు.. చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించాయి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తితో పాటు పశ్చిమ ప్రాంతాలను...అధికారులు పరిశీలించారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీ వద్ద రోడ్డు నష్టం సహా గొల్లవాని గుంట, కృష్ణారెడ్డి నగర్, పూలవాణిగుంట, కొరమేను గుంటలో ముంపునకు గురైన గృహాలు, రోడ్లను పరిశీలించారు. నడింపల్లి గ్రామ రహదారిలో పడిపోయిన స్వర్ణముఖి వంతెన, పాత శానంబట్ల వద్ద రహదారి భారీగా కోతకు గురవటం వల్ల ఎదురవుతున్న సమస్యలను కేంద్ర బృందానికి.. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి వివరించారు. రాయలచెరువు కట్టకు పడిన గండి మరమ్మతుల వివరాలను కేంద్ర బృందం తెలుసుకుంది.

ఇదీచూడండి:Irrigation Plantation: నీటిపారుదలశాఖ భూముల్లో భారీ ఎత్తున మొక్కలు

ABOUT THE AUTHOR

...view details