తెలంగాణ

telangana

బారికేడ్ల చాటున తిరిగితే ప్రజల సమస్యలు తీరుతాయా..?: చంద్రబాబు

By

Published : Jul 29, 2022, 11:20 AM IST

ఏపీలో పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను గోదాట్లో ముంచేసి.. ముఖ్యమంత్రి జగన్‌ చేతులు దులుపుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం కట్టలేనని చేతులెత్తేసి.. పునరావాసం ప్యాకేజీ తన వల్ల కాదనడం దారుణమని దుయ్యబట్టారు. సీఎం బారికేడ్ల చాటున తిరిగితే.. ప్రజల సమస్యలు తీరవని, అర్హులందరికీ పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

బారికేడ్ల చాటున తిరిగితే ప్రజల సమస్యలు తీరుతాయా..?: చంద్రబాబు
బారికేడ్ల చాటున తిరిగితే ప్రజల సమస్యలు తీరుతాయా..?: చంద్రబాబు

బారికేడ్ల చాటున తిరిగితే ప్రజల సమస్యలు తీరుతాయా..?: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. మేడేపల్లి నుంచి వాహనాలతో ర్యాలీగా వేలేరుపాడు మండలం చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను, గృహాలను చంద్రబాబు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు.

అనంతరం.. శివకాశీపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం దగ్గర అమరావతి రాజధాని రైతులు.. వెయ్యి మంది బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కొందరు బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు. శివకాశీపురంలో బాధితులు.. పరిహారం, పునరావాసం, వరదల సాయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుకు ఏకరవు పెట్టారు.

మూడేళ్లుగా ప్రజల కష్టాలు పట్టని ముఖ్యమంత్రి.. ఇప్పుడు బారికే‌డ్లు, పరదాల చాటున పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆకాశంలో తిరిగితే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. కొన్ని కూరగాయలు, ఓ రెండు వేలు చేతిలో పెడితే.. ప్రజలు కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతారని నిలదీశారు. హుద్‌హుద్‌ విపత్తు సమయంలో తెలుగుదేశం హయాంలో ఇచ్చిన జీవోను మెరుగుపరిచి మరింత ఉదారంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంటూర్‌ లెవల్‌ తగ్గించి.. సీఎం జగన్ కొత్తకుట్రకు తెరలేపారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై కేంద్రంతో పోరాడాల్సింది పోయి చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీలందరూ రాజీనామా చేసి.. డిమాండ్‌ చేస్తే పోలవరం ఎందుకు పూర్తికాదని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే.. పోలవరం ముంపు ప్రాంతాలన్నింటినీ కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు.

పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటన అనంతరం చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అర్ధరాత్రి దాటేంత వరకూ ఆయన పర్యటన కొనసాగింది. తెలుగుదేశం ప్రభుత్వం 2000 సంవత్సరంలో దూరదృష్టితో భద్రాచలంలో నిర్మించిన కరకట్టలే ఇప్పుడు అందరినీ కాపాడాయని చంద్రబాబు అన్నారు. వరదల్లో నరసయ్య అనే వ్యక్తి మరణం పట్ల సంతాపం తెలిపిన చంద్రబాబు.. మృతుడి కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున నరసయ్య కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సుదీర్ఘ కాలం తరువాత తెలంగాణకు, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు.. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. తెలంగాణ సరిహద్దు వద్ద చంద్రబాబుకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అర్ధరాత్రి దాటే వరకూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు రాత్రి భద్రాచలంలో బస చేశారు.

ఇవీ చూడండి..ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్ల దుర్వినియోగంపై సర్కార్ నజర్

పవన్​, మహేశ్​ మాత్రమే సాధించిన ఆ రికార్డు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details