AP Lorries Seized: కొవిడ్ ప్రభావం సరకు రవాణా రంగంపై తీవ్రంగా పడింది. అనేక పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తులు చేయకపోవడం, కిరాయిలు లేకపోవడంతో లారీల యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో కిరాయిలు గిట్టుబాటుకాక పోవడమూ సమస్యగా మారింది. మూడు, నాలుగు నెలలుగా పరిస్థితులు చక్కబడుతున్నాయని భావిస్తున్న తరుణంలో.. మళ్లీ ఇపుడు కొవిడ్ మూడో దశ ఆందోళనకు గురిచేస్తోంది. గత పరిస్థితులు పునరావృతమైతే...రవాణా వ్యాపారాన్ని వదిలేసుకోవాల్సి వస్తుందని లారీల యజమానులు చెబుతున్నారు.
30వేలకుపైనే...
రాష్ట్రంలో మూడు లక్షల లారీలు ఉంటే.. అందులో 30 వేలకు పైనే (10 శాతం) లారీలకు వాయిదాలు (లారీల కొనుగోలుకు తీసుకున్న రుణాలకు) చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. మరి కొందరు యజమానులు ఈ పరిస్థితులు తట్టుకోలేక లారీలను అమ్మేసుకున్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందే అనేక మందికి పని లేకుండా పోయింది. 2019లో ఒక్కసారిగా రాష్ట్రంలో నిర్మాణరంగంలో అనిశ్చితి నెలకొంది. 2020 ఆరంభంలో కొవిడ్ తొలిదశ ఆరంభం, మార్చిలో లాక్డౌన్తో సరకు రవాణారంగం పై తీవ్ర ప్రభావం మొదలైంది. మొదటిదశ తర్వాత కొంత వరకే లారీలు రోడ్డెక్కాయి. ఇంతలో కొవిడ్ రెండో దశతో మరోసారి డీలా పడ్డాయి. డీజిల్ ధరలు కూడా అమాంతం పెరగడంతో కిరాయిలు గిట్టుబాటు కాకుండా చేసింది. అయితే గత ఏడాది చివర్లో కొంత పురోగతి కనిపించింది. ఇంతలో మూడో దశరూపంలో మరోసారి ఆందోళన నెలకొంటోంది.
కర్ఫ్యూల కారణంగా...
కొవిడ్ రెండు దశల్లోనూ రాత్రి కర్ఫ్యూలు కారణంగా కొన్నిచోట్ల సరకు రవాణా వాహనాలను పోలీసులు నిలిపేసేవారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు లోడుతో వెళ్లిన లారీలకు ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. దూర ప్రాంతాలకు వెళితే తిరుగు ప్రయాణానికి కిరాయిలు లభించక వారంపాటు అక్కడే వెచిఉండాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా పలు రాష్ట్రాలు, వివిధ నగరాల్లో వారాంతపు లాక్డౌన్లు, రాత్రి కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. దీంతో మరోసారి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
లారీలు అమ్మేసి డ్రైవర్ అయ్యాను..
ఒక లారీతో మొదలుపెట్టి అయిదు లారీలకు యజమాని అయ్యాను. నావద్ద డ్రైవర్లు క్లీనర్లు కలిపి కనీసం 10 మంది పనిచేసేవారు. కొవిడ్ ప్రభావం కారణంగా కిరాయిలు లేక రెండేళ్లలో లారీలన్నీ అమ్మేశాను. ఇప్పుడు ఓ సంస్థలో లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.- కన్నారెడ్డి, విజయవాడ