Bank Deposits: రెండేళ్లుగా దేశంలో డిపాజిట్ రేట్లు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా రుణరేట్లు కూడా తక్కువగా ఉండి, రుణ గ్రహీతలకు పరిస్థితి అనుకూలంగానే ఉండేది. కానీ, తమ వద్ద నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీ మీదే ఆధారపడిన ఎంతోమంది మాత్రం తక్కువ ప్రతిఫలంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కుదుట పడి, రుణాలకు గిరాకీ పెరగడంతో, నిధులను వేగంగా సమీకరించేందుకు మళ్లీ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం ప్రారంభించాయి. దీంతోపాటు ప్రత్యేక డిపాజిట్ పథకాలనూ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఫలితంగా డిపాజిటర్ల కళ్లలో ఆనందం కనిపిస్తోంది.
కొవిడ్ పరిణామాల ప్రభావం తగ్గి, వ్యాపార కార్యకలాపాలు జోరందుకోవడంతో, రిటైల్, వ్యవసాయ, కార్పొరేట్ వర్గాల నుంచీ రుణాలకు గిరాకీ పెరుగుతోంది. కానీ బ్యాంకుల నిధి సమీకరణకు ప్రధాన వనరైన డిపాజిట్లలోకి డబ్బు ఆ స్థాయిలో రావడం లేదు. ఇటీవలి వరకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో డిపాజిట్దారులు ప్రత్యామ్నాయంగా షేర్ల కొనుగోలుకు, మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు ఆసక్తి చూపారు. మార్కెట్ పతనం అయితే.. తమ పెట్టుబడులు ఉపసంహరించడం వెంటనే సాధ్యం కాదనే భావనతో ఉన్న వారు మాత్రం బ్యాంకు డిపాజిట్లలోనే తమ నిధులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయిదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో 7.4 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టేందుకు దీన్ని చాలామంది ఎంచుకుంటున్నారు.