దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ వేగవంతమవటం వల్ల కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం విప్రో.. తమ ఉద్యోగులను సోమవారం నుంచి ఆఫీస్ నుంచి పని చేసే విధంగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతానికి ఉన్నత స్థాయి ఉద్యోగులను మాత్రమే ఆఫీస్కు రప్పించనుంది విప్రో. ఈ విషయాన్ని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ స్వయంగా వెల్లడించారు.
"18 నెలల తర్వాత.. సోమవారం నుంచి మా ఉద్యోగులు ఆఫీస్కు రానున్నారు (వారంలో రెండు రోజులు మాత్రమే). వారంతా పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్న వారే. సురక్షితంగా, భౌతిక దూరం పాటిస్తూ.. పని చేసేందుకు సర్వం సిద్ధమైంది."
-రిషద్ ప్రేమ్జీ ట్వీట్
ఆఫీస్కు వచ్చే ఉద్యోగుల భద్రతకు సంబంధించి ఓ వీడియోను కూడా షేర్ చేశారు ప్రేమ్జీ. ఆఫీస్కు ఎంటర్ అయ్యే ముందు టెంపరేచర్ చెక్, క్యూఆర్ కోడ్ స్కాన్ వంటి జాగ్రత్తలు ఎలా పాటిస్తున్నారో అందులో ఉంది.
జులైలోనే 55 శాతం మందికి వ్యాక్సినేషన్..
విప్రో 75వ వార్షికోత్సవం సందర్భంగా జులై 14న నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రిషద్ ప్రేమ్జీ.. అప్పటికే తమ ఉద్యోగుల్లో 55 శాతం మంది (భారత్లో) వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. విప్రోలో ప్రస్తుతం మొత్తం 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. కొవిడ్ ప్రారంభ దశలోనే భారీ సంఖ్యలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్లు వెల్లడించారు. అప్పటికి (జులై నాటికి) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 3 శాతం మంది మాత్రమే ఆఫీసుల్లో పని చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'వర్క్ ఫ్రం హోం ఆపకపోతే నా భర్తకు విడాకులే!'