తెలంగాణ

telangana

మార్కెట్లలో జోష్​.. ప్రతికూల వాతావరణంలోనూ దూకుడు

By

Published : Jun 18, 2020, 3:54 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​ ఆరంభంలో కలవరపెట్టినా.. చివరకు అదరగొట్టాయి. మిడ్​ సెషన్ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్ధతుతో సెన్సెక్స్ 700 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 10,100 మార్కుకు చేరువైంది.

stock market news
స్టాక్ మార్కెట్ వార్తలు

స్టాక్​మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. భారత్​ చైనా సరిహద్దు వివాదం, దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల అంచనాలు వెలువడుతున్నా బుల్​ ఉరకలేసింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 700 పాయింట్లు లాభపడి 34,208 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 210 పాయింట్లు వృద్ధి చెంది 10,092 వద్ద స్థిరపడింది.

ప్రతికూల వాతావరణంలోనూ రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐ, కోటక్​ బ్యాంక్ షేర్లు రాణించడం లాభాలకు ప్రధాన కారణం.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 34,276 పాయింట్ల అత్యధిక స్థాయి.. 33,371 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,111 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,845 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

రిలయన్స్ షేర్లు గురువారం 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. సంస్థ మార్కెట్​ క్యాపిటల్ రూ.10.5 లక్షల కోట్లు దాటింది. జియోలోకి వస్తున్న వరుస పెట్టుబడులు ఇందుకు ఊతమందిస్తున్నాయి.

బజాజ్ ఫినాన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభపడ్డాయి.

ఓన్​జీసీ, హెచ్​యూఎల్​, టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్, మారుతీ, సన్​ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి బుధవారం స్వల్పంగా 2 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.76.14 వద్ద ఫ్లాట్​గా ఉంది.

ముడిచమురు ధరల సూచీ-బ్రెంట్ 0.42 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 40.88 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఆ 35 వేల మంది ఉద్యోగులపై వేటు తప్పదా!

ABOUT THE AUTHOR

...view details