తెలంగాణ

telangana

సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య.. పెళ్లిరోజునే దారుణం..

By

Published : May 27, 2023, 7:57 AM IST

Updated : May 27, 2023, 11:30 AM IST

wife kills husband

మద్యం తాగి తనతో గొడవపడుతున్నాడనే కోపంతో కట్టుకున్న సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది ఓ భార్య. తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసుల ఎదుట తన భర్తను దుండగులు వచ్చి హత్య చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించేటప్పటికి అసలు విషయం బయటపడింది. దీంతో మృతుడి భార్య, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఛత్తీస్​గఢ్​.. కోర్బాలో దారుణం జరిగింది. సుపారీ ఇచ్చి కట్టుకున్న భర్తను హత్య చేయించింది ఓ భార్య. పెళ్లిరోజునే భర్తను హత్య చేయించింది. అనంతరం పోలీసుల ఎదుట కట్టుకథలు అల్లింది. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఆఖరికి పట్టుబడింది. అసలు నిందితురాలు ఆమె భర్తను ఎందుకు చంపించిందో? భర్తను చంపేందుకు ఎంత సుపారీ ఇచ్చిందో? అనే వివరాల్లోకి వెళ్తే..

కోర్బాకు చెందిన జగ్జీవన్ రామ్​.. సౌత్ ఈస్ట్రన్ కోల్​ఫీల్డ్ లిమిటెడ్(ఎస్ఈసీఎల్​) ఉద్యోగి. అతడికి 2013లో ధనేశ్వరి అనే మహిళతో వివాహమైంది. జగ్జీవన్ రామ్​ మద్యం తాగి ఇంటికి వస్తుండటం వల్ల కొన్నాళ్ల నుంచి దంపతుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ గొడవలు పోలీస్ స్టేషన్​కు​ కూడా చేరాయి. దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకోవాలనుకొని పథకం పన్నింది ధనేశ్వరి. 2023 మార్చిలో తుషార్ సోనీ అలియాస్ గోపి అనే వ్యక్తిని సంప్రదించింది. భర్తను చంపేందుకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పుడే అడ్వాన్స్​గా రూ.50 వేల నగదు కూడా ఇచ్చింది.

ఈ క్రమంలో మే 23వ తేదీ రాత్రి తుషార్ సోనీ​.. జగ్జీవన్ రామ్ ఇంటికి వెళ్లాడు. తలుపులు తెరవగానే జగ్జీవన్ రామ్​ను నీళ్లు అడిగాడు సోనీ. వెంటనే తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో జగ్జీవన్ రామ్​పై దాడి చేశాడు సోనీ. దీంతో జగ్జీవన్ రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం ధనేశ్వరి తన మొబైల్​ ఫోన్​ను పగలగొట్టేసింది. ఆ ఫోన్​ను బయట ఎక్కడైనా విసిరేయమని సోనీకి ఇచ్చింది. అంతేగాక నిందితుడికి సోనీకి రూ.6వేల నగదు, బంగారు నెక్లెస్ ఇచ్చింది. అవి తీసుకున్న నిందితుడు సోనీ అక్కడి నుంచి పరారయ్యాడు.

మే 24వ తేదీ ఉదయం పోలీసులకు తన బావను దుండగులు హత్య చేశారని ధనేశ్వరి సోదరుడు శివకాంత్.. దీప్కా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కొందరు దుండగులు వచ్చి తన బావను చంపి పారిపోయారని సోదరి ధనేశ్వరి ఫోన్​లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులకు మృతుడి భార్య ధనేశ్వరిపై అనుమానం వచ్చింది. కొందరు దుండగులు అర్ధరాత్రి వచ్చి తన భర్తపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారని చెప్పింది. దీంతో తాను భయపడి.. ఇంట్లోని ఓ మూలన కూర్చొండి పోయానని చెప్పింది. తనను కూడా చంపేస్తారేమోనని ఇలా చేశానని పేర్కొంది. అయితే ఆమె చెప్పిన స్టేట్​మెంట్​పై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. తన భర్త మద్యం మత్తులో తనతో తరచుగా గొడవకు దిగేవాడని పోలీసులకు తెలిపింది ధనేశ్వరి. దీంతో మనస్తాపానికి గురై అతడిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అందుకే సుపారీ ఇచ్చి తుషార్​ సోనీతో హత్య చేయించానని వెల్లడించింది. ఈ క్రమంలో నిందితులు ధనేశ్వరి, తుషార్​ సోనీను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరినీ రిమాండ్​కు తరలించారు.

Last Updated :May 27, 2023, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details