తెలంగాణ

telangana

Viveka murder case: వివేక హత్య వార్తను జగన్‌కు ఎవరు చెప్పారు? సీబీఐ విచారణలో కీలక సాక్షుల వాంగ్మూలాలు ఇవే!

By

Published : Jul 21, 2023, 3:45 PM IST

Updated : Jul 21, 2023, 6:06 PM IST

Viveka
Viveka

15:34 July 21

కీలక సాక్షుల వాంగ్మూలాలను గతనెల 30న కోర్టుకు సమర్పించిన సీబీఐ

Vivekananda Reddy murder case updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కీలక సాక్షుల వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. వివేకా హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కీలక సాక్షుల వాంగ్మూలాలను గత నెల 30వ తేదీన కోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలో సీబీఐ సమర్పించిన వాంగ్మూలాలను.. ధర్మాసనం విచారణకు స్వీకరించడంతో మరికొంతమంది కీలక సాక్షుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ కీలక సాక్షుల్లో.. సీఎం జగన్‌ ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, విశ్రాంత సీఎస్‌ అజేయ కల్లం, వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్‌ అటెండర్‌ గోపరాజు నవీన్‌కుమార్‌‌ల నుంచి సాక్షులుగా సేకరించినట్లు సీబీఐ పేర్కొంది.

వివేకా కేసులో మరికొంతమంది కీలక సాక్షులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకానంద రెడ్డి హత్య చేయబడిన (2019 మార్చి 15న) రోజున ఏం జరిగింది..?, ఎవరెవరు ఉన్నారు..?, ఎవరెవరి మధ్య ఏయే సంభాషణలు జరిగాయి..?, జగన్‌కు ఈ సమాచారం ఎలా చేరింది..? అనే వివరాలను, కీలక సాక్షుల పేర్లను కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ.. జూన్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న నాంపల్లి సీబీఐ కోర్టులో సమర్పించింది. అందులో జగన్ అటెండర్ జి.నవీన్, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విశ్రాంత సీఎస్ అజేయ కల్లం కీలక సాక్షులుగా ఉన్నట్లుగా వివరించింది.

గోపరాజు నవీన్.. అంతేకాకుండా, వివేకా హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారిని సీబీఐ విచారించినట్లు కూడా వెల్లడించింది. అందులో మొదటగా.. జగన్ అటెండర్ జి.నవీన్‌‌ను విచారించగా..''ఆరోజు ఉదయం 6.30కు అవినాష్ తనకు ఫోన్ చేసి జగన్ ఉన్నారా..? అని అడిగారు. దానికి నేను కృష్ణమోహన్ రెడ్డి, జీవీడీతో జగన్ సమావేశమయ్యారని చెప్పా. దీంతో కృష్ణమోహన్ రెడ్డికి వెంటనే ఫోన్ ఇవ్వమని అవినాష్ నన్ను కోరారు. వెంటనే సమావేశం గదికి వెళ్లి, అవినాష్ లైన్‌లో ఉన్నారని కృష్ణమోహన్‌ రెడ్డికి ఫోన్ ఇచ్చాను. ఆ తర్వాత అవినాష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదు.'' అని నవీన్ తాను ఇచ్చిన వాంగ్మూలంలో సమాధానాలు చెప్పినట్లు సీబీఐ వివరించింది.

ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.. ఆ తర్వాత వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సీబీఐ విచారించింది. ''సమావేశం జరుగుతుండగా అటెండర్ నవీన్ తలుపు తెరిచారు. నన్ను భేటీ నుంచి బయటకు రావాలని నవీన్ కోరారు. దీంతో నేను బయటికి రాగా.. అవినాష్ రెడ్డి మీతో మాట్లాడుతారంటూ నవీన్ నాకు ఫోన్ ఇచ్చారు. వివేకా మరణించారని అవినాష్ నాకు ఫోన్‌లో చెప్పారు. దీంతో నేను ఎలా జరిగింది..? అని అవినాష్ రెడ్డిని అడిగాను. దానికి అవినాష్ బాత్‌రూమ్‌లో మృతదేహం ఉందని నాకు చెప్పారు. బాత్‌రూమ్‌లో చాలా రక్తం ఉందని కూడా అవినాష్ చెప్పారు. జగన్‌కు వెంటనే ఈ సమాచారం చెప్పండని చెప్పి అవినాష్ ఫోన్ కట్ చేశారు. దీంతో నేను వివేకా మరణించిన విషయాన్ని జగన్‌కు చెవిలో చెప్పాను. బెడ్‌రూం, బాత్‌రూంలో రక్తం ఉన్న విషయాన్ని కూడా చెప్పాను. దాంతో జగన్ ముందు ఇంటికి వెళ్లి, ఆ తర్వాత పులివెందుల వెళ్లారు. అవినాష్‌తో ఐదుసార్లు ఎందుకు మాట్లాడారన్న సీబీఐ ప్రశ్నకు.. జగన్ పులివెందుల పర్యటన కోసమే నేను ఐదుసార్లు ఫోన్‌ చేసి ఉంటా!. జగన్ ఫోన్ వాడరు.. పీఏ లేదా నా ఫోన్‌లోనే మాట్లాడతారు.'' అని కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించాడని సీబీఐ వివరించింది.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. వివేకా హత్య కేసులో మరొక సాక్షి అయిన వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇచ్చిన వాంగ్మూలంలో..''భేటీ సమయంలో ఎవరో వచ్చి వివేకా మరణించారని జగన్‌కు చెప్పారు. వివేకా మరణంపై జగన్‌కు చెప్పింది ఎవరో నాకు గుర్తులేదు.'' అని ఉమ్మారెడ్డి చెప్పినట్లు సీబీఐ పేర్కొంది.

విశ్రాంత సీఎస్ అజేయ కల్లం.. చివరగా.. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న విశ్రాంత సీఎస్ అజేయ కల్లంను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారించగా..''లోటస్‌పాండ్‌లో ఉండగా ఆరోజు ఉదయం 5.30కు జగన్ అటెండర్ తలుపు కొట్టారు. భారతి మేడం మేడపైకి రమ్మంటున్నారని అటెండర్.. జగన్‌కు చెప్పారు. బయటకు వెళ్లిన 10 నిమిషాల తర్వాత జగన్‌ మళ్లీ వచ్చారు. బాబాయ్ ఇక లేరని నిలబడే జగన్ మాకు చెప్పారు.'' అని అజేయ కల్లం వెల్లడించినట్టు సీబీఐ వాంగ్మూలంలో వివరించింది.

వివేకా మరణ వార్త జగన్‌కు ఎవరు చెప్పారు..?.. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య వార్తను జగన్‌కు ఎవరు చెప్పారన్న కోణంలోనే సీబీఐ పలువురిని ప్రశ్నించింది. అందులో ప్రధానంగా.. జగన్ ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి, విశ్రాంత సీఎస్ అజేయ కల్లం, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అటెండర్ నవీన్‌‌లను (మొత్తం నలుగురిని) ప్రశ్నించి..వారి వాంగ్మూలాలను గత నెల 30న ఛార్జిషీట్‌తో పాటు సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య జరిగిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ నేతృత్వంలో సమావేశం జరిగినట్లు సాక్షులు తెలిపారు. మేనిఫెస్టోతోపాటు మరికొన్ని అంశాలపై ప్రసంగంపై చర్చ జరుగుతుండగా.. వివేకా మరణ వార్త జగన్‌కు తెలిసినట్లు వివరించారు.

Last Updated :Jul 21, 2023, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details