తెలంగాణ

telangana

త్రిపుర సీఎంగా మాణిక్​ సాహా ప్రమాణం.. మంత్రివర్గంలోకి 8 మంది

By

Published : Mar 8, 2023, 11:27 AM IST

Updated : Mar 8, 2023, 12:57 PM IST

tripura cm manik saha oath latest news

త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని అగర్తలాలోని స్వామి వివేకానంద మైదానం​లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.

త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని అగర్తలాలోని స్వామి వివేకానంద మైదానం​లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్​ శ్రీ సత్యదియో నరేన్​ ఆర్య.. మాణిక్​ సాహా, కేబినెట్​ మంత్రులుగా రతన్ లాల్ నాథ్, ప్రణజిత్ సింఘా రాయ్, సంతాన చక్మా సహా ఎనిమిది మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు.

అయితే ఈ ఎనిమిది మంది మంత్రుల్లో కమల దళం మిత్రపక్షమైన ఐపీఎఫ్​టీ పార్టీ నుంచి ఒకరిని, బీజేపీ నుంచి ఏడుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో అయిదుగురికి మొదటిసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. కాగా, ఈశాన్య రాష్ట్రంలో ఎన్నికల సమయంలో జరిగిన పలు హింసాత్మక ఘటనలకు నిరసనగా వామపక్ష-కాంగ్రెస్ కూటమి ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

కాగా, గతనెల 16న జరిగిన ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలకు గానూ 32 చోట్ల విజయం సాధించింది కాషాయ పార్టీ. దీని మిత్రపక్షం ఐపీఎఫ్​టీ ఒక స్థానంలో గెలుపొందింది. 2018లో త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన బిప్లబ్​ కుమార్​ దేబ్ హయాంలో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తడం వల్ల.. దేబ్​ స్థానంలో 2022లో మాణిక్​ సాహా సీఎంగా మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. గతేడాది మొదటిసారి త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టిన 70 ఏళ్ల మాణిక్​ సాహా.. తాజాగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు.

అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ..
గత మూడు దశాబ్దాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వామపక్షాలతో జతకట్టకుండా మొదటిసారి అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. 1988లో కాంగ్రెస్-టీయూజేఎస్ వామపక్షాలను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. 1993లో కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయి రెండో సారి అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది.

మరోవైపు.. మంగళవారం నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రియోతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని కొహిమాలో జరిగిన కార్యాక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సహా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు.

మంగళవారం నాగాలాండ్​, మేఘాలయ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ సాయంత్రం అసోం గువాహటిలో జరిగిన పార్టీ కేబినెట్ సీనియర్​ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కోయినాదొర రాష్ట్ర అతిథి గృహంలో​ నిన్న రాత్రి బస చేసిన మోదీ త్రిపురకు బయలుదేరేముందు గెస్ట్ హౌస్​ ఆవరణలో ఓ మొక్కను నాటారు.

Last Updated :Mar 8, 2023, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details