తెలంగాణ

telangana

Supreme Court: వాలంటీర్ల దినపత్రిక కొనుగోలు కేసు.. ఉషోదయ పబ్లికేషన్స్ పిటిషన్ దిల్లీ హైకోర్టుకు బదిలీ

By

Published : Apr 17, 2023, 8:05 PM IST

Updated : Apr 17, 2023, 8:23 PM IST

Ushodaya Publications: గ్రామ - వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు 'సాక్షి' పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఒక్కొక్కరికి నెలకు 200 రూపాయల చొప్పున మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. ఉషోదయ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణను.. సుప్రీంకోర్టు దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.

Supreme Court
Supreme Court

Ushodaya Publications: వార్తా పత్రిక కొనుగోలు కోసం గ్రామ, వార్డు వాలంటీర్లకు రెండు వందల రూపాయల మేర ఆర్థిక సాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీఓలను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ సంస్థ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్​ పిటిషన్ నెం: 3041/2023ని దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సోమవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్ధివాలలతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించి, వాటిని ప్రజలు అందుకునేలా సాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్​లో 2.56 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వారికి నెలవారీగా ఇచ్చే 5వేల రూపాయల గౌరవ వేతనానికి తోడు.. విస్తృత సర్క్యులేషన్ ఉన్న వార్తా పత్రిక కొనుగోలు కోసం ఆ 2.56 లక్షల మంది వార్డు, గ్రామ వాలంటీర్లకు నెలకు రెండు వందల రూపాయల చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది.

తర్వాత పత్రిక కొనుగోలు కోసం 1.45 లక్షల మంది గ్రామ/వార్డు ఉద్యోగులకు నెలకు రెండు వందల రూపాయలు మంజూరు చేస్తూ 2022 డిసెంబర్లో మరో జీవో జారీ చేసింది. ఆ జీవోల్లో ప్రత్యేకంగా సాక్షి పేరు ప్రస్తావించకపోయినా.. అందులో పెట్టిన వివిధ షరతులతోపాటు.. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, పార్టీ కార్యకర్తలు ఈనాడును బహిరంగంగా ఎల్లో మీడియాగా అభివర్ణిస్తూ ఆపత్రికను చదవొద్దని చేసిన ప్రకటనలు వాలంటీర్లు తప్పనిసరిగా సాక్షి పత్రికనే కొనుగోలు చేసేలా ఉన్నాయని పేర్కొంటూ.. ఆ రెండు జీవోలను ఉషోదయ పబ్లికేషన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు సవాల్ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన జీఓలు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పిస్తూ, ఆ పథకాలను అందుకోవడంలో ప్రజలకు సహకారం అందించడానికి.. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 2.56 లక్షల మంది వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గతంలో నియమించింది. వారికి నెలవారీ 5 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. విస్తృత సర్క్యులేషన్‌ ఉన్న పత్రిక కొనుగోలుకు నెలకు 200 రూపాయల చొప్పున వాలంటీర్లకు చెల్లించాలని.. 2022 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 1.45 లక్షల మంది వాలంటీర్లకు 200 రూపాయల చొప్పున మంజూరు చేస్తూ 2022 డిసెంబర్‌లో మరో జీవో ఇచ్చింది. ఈ రెండు జీవోలను సవాల్‌ చేస్తూ.. ఈనాడు ప్రచురణకర్త అయిన ఉషోదయ పబ్లికేషన్స్‌ గత ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ జీవోల్లో 'సాక్షి' అనే పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా.. అందులో పెట్టిన షరతులు గానీ, ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, పార్టీ కార్యకర్తలు 'ఈనాడు'ను ఎల్లో మీడియాగా విమర్శిస్తూ.. ఆ పత్రికను చదవొద్దని చేస్తున్న ప్రచారం.. వాలంటీర్లు కచ్చితంగా 'సాక్షి'నే కొనమని సూచించేలా ఉన్నాయని పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 17, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details