తెలంగాణ

telangana

'భారత్​లో కాలుష్య కట్టడికి పాక్ పరిశ్రమలపై నిషేధమా?'

By

Published : Dec 3, 2021, 11:44 AM IST

Updated : Dec 3, 2021, 2:20 PM IST

Sc delhi air pollution: వాయు కాలుష్య నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్​లను ఎయిర్ క్వాలిటీ మేనేజ్​మెంట్ కమిషన్​ ఏర్పాటు చేసిందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మరోవైపు.. దిల్లీలో ఆస్పత్రుల నిర్మాణ పనులు కొనసాగించేందుకు అనుమతించాలని దిల్లీ ప్రభుత్వం కోరగా సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది.

sc on delhi air pollution
దిల్లీలో వాయు కాలుష్యం

Sc delhi air pollution: వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. నిబంధనలు పాటించేలా చూసేందుకు ఫ్లయింగ్ స్కాడ్​లను ఎయిర్​ క్వాలిటీ మేనేజ్​మెంట్​ కమిషన్​ ఏర్పాటు చేసిందని తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్​ను సమర్పించింది. దిల్లీ ప్రభుత్వం కూడా వాయు కాలుష్య నియంత్రణకు చేపట్టిన చర్యలు వివరిస్తూ.. మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. ఆస్పత్రుల నిర్మాణ పనులు కొనసాగేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును తన అఫిడవిట్​లో కోరింది. దిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.

ఇదీ చూడండి:టీవీ ఛానళ్లలో చర్చల వల్లే ఎక్కువ కాలుష్యం: సుప్రీం

Delhi construction works ban: కరోనా మూడో వేవ్​ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధమవుతున్నామని కోర్టుకు దిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా.. ఆస్పత్రుల మౌలిక వసతులను పునరుద్ధరించడం సహా ఏడు కొత్త ఆస్పత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. కానీ, నిర్మాణ పనులపై నిషేధం విధించడం వల్ల ఆ పనులు ఆగిపోయాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించిన పనులకు అనుమతివ్వాలని కోరింది.

'మమ్మల్ని విలన్లుగా చూపిస్తున్నారు'

Sc on media: పరిశ్రమల మూసివేతతో రాష్ట్రంలో చెరకు, పాడి పరిశ్రమలపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టుకు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం తెలిపింది. యూపీ దిగువగా ఉన్నందున పాకిస్థాన్ నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పాకిస్థాన్​లోని పరిశ్రమలు మూసివేయమంటారా అని ప్రశ్నించింది. "ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో లేదో తెలియదు. కానీ, మీడియాలోని కొన్ని వర్గాలు మమ్మల్ని విలన్లుగా చూపించేందుకు యత్నిస్తున్నాయి. పాఠశాలలను మూసివేయాలని మేం కోరుకుంటున్నామని చెప్పాయి. దిల్లీలో నిరవధికంగా పాఠశాలలు మూసివేయాలని మేం ఆదేశించలేదు. కాలుష్య స్థాయులు అధికంగా ఉన్న సమయంలో పెద్దలు ఇంటినుంచి పనిచేస్తుంటే పిల్లలు పాఠశాలకు వెళ్లడంపై మాత్రమే ప్రశ్నించాం." అని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్పత్రుల నిర్మాణ పనులు కొనసాగించేందుకు దిల్లీ ప్రభుత్వానికి అనుమతినిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబరు 10కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:దిల్లీ కాలుష్యంతో ప్రాణాలకు ముప్పు: నాసా

రాజధానిలో వాయు కాలుష్య నివారణకు క్షేత్ర స్థాయి చర్యలు ఏమీ కనిపించడం లేదని గురువారం సుప్రీంకోర్టువ్యాఖ్యానించింది. కాలుష్య నివారణకు తీసుకోనున్న చర్యలపై 24 గంటల (శుక్రవారం ఉదయం పది గంటలు)లోగా సమాచారం ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యాన్ని తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దిల్లీ ప్రభుత్వం, కేంద్రం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశాయి.

ఇదీ చూడండి:'కుంటిసాకులు మాని.. ఏ చర్యలు తీసుకుంటారో తేల్చండి'

Last Updated : Dec 3, 2021, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details