తెలంగాణ

telangana

స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు.. తుది వాదనలు ఆరోజే : సుప్రీంకోర్టు

By

Published : Mar 13, 2023, 6:12 PM IST

same sex marriage supreme court
same sex marriage supreme court

స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనదని పేర్కొంది. ఈ అంశంపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18న తుది వాదనలు వింటుందని వెల్లడించింది.

దేశంలో స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18న తుది వాదనలు వింటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమాజంపై భారీ ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని ప్రాముఖ్యమైనదిగా పేర్కొన్న సుప్రీం.. విచారణను తమ వెబ్‌సైట్ సహా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పింది.

కాగా, ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఫిడవిట్​ దాఖలు చేసింది. అందులో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించలేమని తేల్చిచెప్పింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, భిన్న లింగ సంపర్కుల పెళ్లిళ్లు పూర్తిగా విరుద్ధమైనవని.. భారత కుటుంబవ్యవస్థతో పోల్చలేమని స్పష్టం చేసింది. వాటిని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ''స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే.. సున్నితమైన పర్సనల్​ చట్టాల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. అందరూ పాటిస్తున్న సామాజిక, సాంస్కృతిక నియమాలకు భంగం కలుగుతుంది. వ్యక్తిగత​ చట్టాలలో ఇలాంటి వాటిని గుర్తించడం గాని.. అమలు చేయడం గాని సాధ్యం కాదు. ఇలాంటి వివాహాలకు ఇదివరకే సెక్షన్ 377 ఉంది. వీటికి మళ్లీ ప్రాథమిక హక్కు కింద పిటిషనర్లు కోరడం తగదు." అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొంది.

స్వలింగ సంపర్కుల వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్​కు చెందిన అభయ్​ దాంగ్​, సుప్రియో చక్రవర్తి.. ఈ వ్యాజ్యాలు వేశారు. వీరితో పాటు పార్థ్​ ఫిరోజ్​, ఉదయ్​ రాజ్​ అనే మరో స్వలింగ సంపర్కుల జంట ఇదే విషయమై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒకే లింగానికి చెందిన వారనే కారణంతో.. ఇద్దరి వివాహానికి గుర్తింపు ఇవ్వకపోవడం.. రాజ్యాంగంలోని 14, 21వ అధికరణల కింద సమానత్వ హక్కును ఉల్లఘించడమేనని ఆయా పిటిషన్లలో వారు వాదించారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించి దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్​లో ఉన్న కేసులు అన్నింటినీ ఏకం చేసి.. తనకు బదిలీ చేసుకుంది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో.. కేంద్రం ఆదివారం అఫిడవిట్ సమర్పించింది.

ABOUT THE AUTHOR

...view details