తెలంగాణ

telangana

తమిళనాడులో వరదలు బీభత్సం- వంట సామాన్లతో ఇళ్ల నుంచి రోడ్లపైకి ప్రజలు, సాయం కోసం ఎదురుచూపులు!

By PTI

Published : Dec 19, 2023, 12:51 PM IST

Updated : Dec 19, 2023, 2:00 PM IST

Rains In South Tamilnadu : తమిళనాడులో కురిసిన వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వానల కారణంగా పోటెత్తిన వరదలతో దక్షిణ తమిళనాడు జనం విలవిల్లాడుతున్నారు. వారు నివసించే ఇళ్లలోకి నీరు చేరడం వల్ల కేవలం వంట సామాన్లు మాత్రమే తీసుకొని రోడ్లపైకి వచ్చి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక వీరిని రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసిన సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్​ను వేగవంతం చేశాయి.

Rains In South Tamilnadu Rescue Operation
Rains In South Tamilnadu

Rains In South Tamilnadu :తమిళనాడు దక్షిణ జిల్లాల్లో కురిసిన వర్షాల వల్ల పోటెత్తిన వరదలకు ప్రజలు అల్లాడి పోతున్నారు. తూతుకూడి నగరం దాదాపు నీట మునిగింది. జాతీయ రహదారిపైనా నీరు చేరింది. నీట మునిగిన ఇళ్ల నుంచి వంట సామాన్లు మాత్రమే తీసుకుని ప్రజలు రోడ్లపైకి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

హెలికాఫ్టర్ల సాయంతో సహాయక చర్యలు
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక ఫోర్స్​ రంగంలోకి దిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సహాయక చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే హెలికాఫ్టర్​లను రెస్క్యూ ఆపరేషన్​ కోసం వినియోగిస్తున్నారు. తూతుకూడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్‌లో చిక్కుకుపోయిన 800 మందిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్డీఆర్​ఎఫ్​, వైమానికదళం, రైల్వే, స్థానిక అధికారులతో కలిసి శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్‌లోనే చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

స్టేషన్‌లో చిక్కుకుపోయిన వారిలో 300 మందిని దగ్గరలోని ఒక పాఠశాలలో, మిగిలిన వారిని రైల్వే స్టేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్​లో ఒక చిన్నారి, గర్భిణీ సహా అనేక మంది ప్రయాణికుల ప్రాణాలను హెలికాఫ్టర్‌ల సాయంతో రక్షించగలిగాయి రక్షణ దళాలు. ఇక శ్రీవైకుంఠంకు 38కి.మీ దూరంలో ఉన్న ఉన్న వంచి మాణియాచ్చి రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్లే వారికోసం సైతం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ.

తిరునల్వేలిలో అనేక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను బోట్ల సాయంతో పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. విపత్తు నిర్వహణ దళం, పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసాయం అందిస్తోంది. తమిళనాడు దక్షిణాది జిల్లాల్లో సహాయ చర్యల కోసం మొత్తం 200 బోట్లను ఉపయోగిస్తున్నారు.

స్వయంగా స్టాలిన్​ రంగంలోకి
దక్షిణాది జిల్లాల్లో ఏడాది కాలం కురవాల్సిన వర్షాలు కేవలం ఒక్కరోజులోనే పడ్డాయని, వీటి ద్వారా వాటిల్లే నష్టం నుంచి బయటపడేందుకు కేంద్రం అవసరైన నిధులను పంపాలని కోరారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్​. ఇక సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తూతుకూడిలో పర్యటించిన అనంతరం సీఎం స్టాలిన్​ విలేకరులతో తెలిపారు.

"తిరునల్వేలి, తూతుకూడిలో కురిసినంత భారీ వర్షాలు గత 60 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒక్క కాయల్‌పట్నంలోనే 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది."
- స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి

ఒక్కో కుటుంబానికి రూ.6వేలు
ఇప్పటివరకు మొత్తం 12,653 మందిని రక్షించామని, శిబిరాలకు తరలించిన వారికి హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికే ఇది పెద్ద విపత్తుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు స్టాలిన్​. దీని నుంచి బయట పడేందుకు తక్షణ సాయంగా సుమారు రూ.20 వేల కోట్లను విడుదల చేసినట్లు ఆయన అన్నారు. ఇక వరద ప్రభావిత జిల్లాల్లో ఒక్కో కుటుంబానికి రూ.6 వేల చొప్పును ఆర్థిక సహాయం అందించనున్నట్లు స్టాలిన్​ ప్రకటించారు.

తమిళనాడుపై వరుణుడి ప్రకోపం- నీటమునిగిన ఇళ్లు, పొలాలు- ప్రభుత్వం అలర్ట్

దక్షిణ తమిళనాడు అస్తవ్యస్తం- రైల్వే స్టేషన్​లో చిక్కుకున్న 800 మంది- మోదీకి స్టాలిన్ లేఖ

Last Updated : Dec 19, 2023, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details