తెలంగాణ

telangana

'రాహుల్​ ప్రధాని అవుతారు'.. స్వామీజీ జోస్యం.. ఇంతలోనే..

By

Published : Aug 3, 2022, 5:42 PM IST

Updated : Aug 3, 2022, 5:51 PM IST

Rahul Gandhi has been initiated into Lingayat sect and he will become the PM: says Haveri Hosamutt Swamiji
Rahul Gandhi has been initiated into Lingayat sect and he will become the PM: says Haveri Hosamutt Swamiji ()

Rahul Gandhi Karnataka: కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ప్రధాని అవుతారని ఓ స్వామీజీ జోస్యం చెప్పారు. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్​ గాంధీ ప్రధాని అయ్యారని.. ఇప్పుడు రాహుల్​ కూడా అవుతారని అన్నారు హవేరీ హోసముట్​ స్వామీజి. అయితే.. అంతలోనే జోక్యం చేసుకున్న మురుగ మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణరు.. ఇక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు.

Rahul Gandhi Karnataka: కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్​ను సందర్శించారు. మఠాధిపతి డా. శ్రీ శివమూర్తి మురుగ రాజేంద్ర శరణరు నుంచి ఆయన 'ఇష్టలింగ దీక్ష'ను స్వీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్​ ట్విట్టర్​లో వెల్లడించారు. సాధారణంగా లింగాయత్​ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు.. ఈ ఆచారాన్ని పాటిస్తారు. స్వామి బసవన్న బోధనలు ఎప్పటికీ నిలిచి పోతాయని, వాటి గురించి తాను తెలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు రాహుల్​. మఠాన్ని సందర్శించిన రాహుల్​ వెంట కర్ణాటక ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ కూడా ఉన్నారు.

మఠాధిపతి డా. శ్రీ శివమూర్తి మురుగ రాజేంద్ర శరణరుతో రాహుల్​
చిత్రదుర్గలోని మఠానికి రాహుల్​ గాంధీ

అయితే.. ఈ క్రమంలోనే రాహుల్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ స్వామీజీ. రాహుల్​ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని జోస్యం చెప్పారు హవేరి హోసముట్​ స్వామీజీ. అయితే ఇంతలోనే జోక్యం చేసుకున్న మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణరు.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్వామీజీని అడ్డుకున్నారు. ఇది రాజకీయ వేదిక కాదని.. ప్రజలే దానిని నిర్ణయిస్తారని చెప్పారు.

శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర మఠంలో రాహుల్​
ఇష్టలింగ దీక్షను స్వీకరిస్తున్న రాహుల్​ గాంధీ

''ఇందిరా గాంధీ ప్రధానిగా పనిచేశారు. రాజీవ్​ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు రాహుల్​ గాంధీ లింగాయత్​ శాఖలోకి ప్రవేశించారు కాబట్టి.. ఈయన కూడా ప్రధాని అవుతారు.''

- హవేరి హోసముట్​ స్వామీజీ

అంతా కలిసి భాజపాను ఓడిస్తాం.. హుబ్బళ్లిలో కాంగ్రెస్​ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశానికి హాజరయ్యేందుకు మంగళవారమే కర్ణాటక చేరుకున్నారు రాహుల్​. ఆ రాత్రి జరిగిన భేటీలో.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత గురించి రాష్ట్ర కాంగ్రెస్​ నేతలతో చర్చలు జరిపారు. బుధవారం.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య 75వ జన్మదిన వేడుకలకు కూడా రాహుల్​ హాజరయ్యారు​.

2023 ఏప్రిల్​- మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్​ నుంచి డీకే శివకుమార్,​ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బుధవారం ఆసక్తికర పరిణామం జరిగింది. రాహుల్​ గాంధీ సమక్షంలోనే.. సిద్ధరామయ్యను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు డీకే. దీనిపై రాహుల్​ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీ సమష్టిగా పోరాడి.. కర్ణాటకలో భాజపా, ఆర్​ఎస్​ఎస్​ను ఓడిస్తుందని అన్నారు.

ఇవీ చూడండి:ఐసీయూలో రోగికి 'భూతవైద్యుడి' ట్రీట్​మెంట్​.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా..

ఇంట్లోనే 'హిమాలయన్​ వయాగ్రా' సృష్టి.. కిలో రూ.25 లక్షలు.. రైతుకు జాక్​పాట్​!

Last Updated :Aug 3, 2022, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details