తెలంగాణ

telangana

అప్పుడు హగ్ ఇచ్చి, కన్ను కొట్టి.. ఇప్పుడు ఫ్లయింగ్ కిస్.. రాహుల్ గాంధీపై మహిళా ఎంపీల ఫిర్యాదు

By

Published : Aug 9, 2023, 4:47 PM IST

Rahul Flying Kiss Video : పార్లమెంట్​లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ స్పీకర్ ఓంబిర్లాకు బీజేపీ మహిళా ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం పూర్తైన తర్వాత బయటకు వెళ్లే ముందు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, గతంలో సభలో జరిగిన ఇదే తరహా ఘటనపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

rahul flying kiss video
rahul flying kiss video

Rahul Flying Kiss Video Parliament :కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్​సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్న ఆరోపణలు దుమారం రేపాయి. సభలో ఇలాంటి చర్య ఎప్పుడూ చూడలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మహిళా వ్యతిరేకులు మాత్రమే ఇలాంటి పని చేయగలరని ధ్వజమెత్తారు. ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ మహిళా ఎంపీలు లోక్​సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. రాహుల్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్​కు చేసిన ఫిర్యాదులో 20 మంది మహిళా ఎంపీలు సంతకాలు చేశారు. 'కాంగ్రెస్ సభ్యుడు సభలో మాట్లాడుతూ స్మృతి ఇరానీవైపు అనుచిత సంజ్ఞలు చేశారు' అని ఫిర్యాదులో మహిళా ఎంపీలు ఆరోపించారు.

Rahul Flying Kiss Row :అవిశ్వాస తీర్మానంపై రాహుల్ మాట్లాడిన తర్వాత.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగించారు. రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. "నా కన్నా ముందు మాట్లాడిన వ్యక్తి అసభ్య సంజ్ఞ చేశారు. మహిళా వ్యతిరేకులు మాత్రమే మహిళా ఎంపీలు ఉండే పార్లమెంట్​కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. ఆ (గాంధీ) కుటుంబ సంస్కృతిని దేశమంతా చూసింది" అని ఇరానీ మండిపడ్డారు.

మరోవైపు, బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సైతం రాహుల్​పై విమర్శలు చేశారు. "స్మృతి ఇరానీ వైపు, అందరు మహిళా సభ్యులు ఉన్నవైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇది అనుచితమే కాదు.. అసభ్యకరం కూడా. పార్లమెంట్ చరిత్రలో ఇలాంటిది ఎన్నడూ జరగలేదని సీనియర్ ఎంపీలు చెబుతున్నారు. కాబట్టి దీనిపై మేం స్పీకర్​కు ఫిర్యాదు చేశాం. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించి ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం" అని కరంద్లాజే వివరించారు.

Rahul Flying Kiss in Lok Sabha Video :
పార్లమెంట్​.. ఫ్లయింగ్ కిస్​లు ఇచ్చే ప్రదేశమా? అంటూ బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళా ఎంపీలు కూర్చున్న చోట అలాంటి పని చేయడం అవమానకరమంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం తమ సంస్కృతికి వ్యతిరేకమని కేంద్ర మంత్రి దర్శనా జర్దోశ్ పేర్కొన్నారు. అలాంటి చర్యలను సహించే ప్రసక్తే లేదన్నారు.

Rahul Gandhi Hug to Modi : రాహుల్ తన ప్రసంగం పూర్తయ్యాక ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. పార్లమెంట్​లో గత అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన ఘటనను పలువురు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎన్​డీఏ సర్కారుపై 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉద్వేగంగా మాట్లాడిన రాహుల్.. ప్రసంగం పూర్తైన తర్వాత మోదీ వద్దకు వెళ్లి ఆయనన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత తన సీటులో కూర్చొని సహచర ఎంపీకి కన్ను కొట్టారు. ఇది అప్పట్లో తీవ్ర దుమారానికి దారి తీసింది.

పక్కదారి పట్టించే వ్యూహం
కాగా, బీజేపీ ఎంపీల ఆరోపణలపై కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కార్తి చిదంబరం మండిపడ్డారు. సభలో రాహుల్ గాంధీ కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారని, మణిపుర్​లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారని అన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా బీజేపీ.. విషయాన్ని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. చరిత్రలో జరిగిన వాటి గురించి మాట్లాడుతూ.. మణిపుర్​తో సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తోందని మండిపడ్డారు.

'రాహుల్​ను టీవీలో చూపించరా?'
ఇదిలా ఉండగా.. పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసే సంసద్ టీవీ.. రాహుల్ ప్రసంగిస్తుండగా స్పీకర్​ను చూపించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. అవిశ్వాస తీర్మానంపై ఆయన 37 నిమిషాలు మాట్లాడితే 14 నిమిషాల 37 సెకన్ల పాటు మాత్రమే సంసద్ టీవీ.. రాహుల్​ను స్క్రీన్​పై చూపించిందని జైరాం రమేశ్ విమర్శించారు. రాహుల్​ను చూసి మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

"లోక్​సభలో రాహుల్ తిరిగి అడుగుపెట్టాక తొలి ప్రసంగంలో 12.09pm నుంచి 12.46pm వరకు మాట్లాడారు. అంటే 37 నిమిషాలు. సంసద్ టీవీ మాత్రం ఆయన్ను 14 నిమిషాల 37 సెకన్లు మాత్రమే చూపించింది. అంటే 40 శాతం కంటే తక్కువ సమయం. మణిపుర్​ అంశంపై రాహుల్ మాట్లాడిన సమయంలో ఇది మరింత పడిపోయింది. మణిపుర్​పై 15 నిమిషాల 42 సెకన్ల పాటు రాహుల్ మాట్లాడారు. ఈ సమయంలో 11 నిమిషాల 08 సెకన్ల పాటు సంసద్ టీవీ కెమెరాలు ఓంబిర్లానే చూపించాయి. రాహుల్ మాట్లాడుతున్న సమయంలో 71 శాతం స్పీకర్​నే చూపించాయి. రాహుల్​ గాంధీ 4 నిమిషాల 34 సెకన్ల పాటు మాత్రమే స్క్రీన్​పై కనిపించారు. అసలు మోదీ భయపడటానికి కారణమేంటి?"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

'మణిపుర్​లో భరతమాత హత్య.. అందుకే ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ దూరం'

'భరతమాత' వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ ఫైర్​.. రాహుల్ 'ఫ్లయింగ్ కిస్​'పై దుమారం

ABOUT THE AUTHOR

...view details