తెలంగాణ

telangana

పంజాబ్​లో టెన్షన్ టెన్షన్​.. ఇంటర్నెట్ బంద్​.. అమృత్​పాల్​ కోసం ముమ్మర గాలింపు

By

Published : Mar 19, 2023, 2:31 PM IST

amritpal singh punjab

ఖలిస్థానీ అనుకూల 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్​పాల్​ సింగ్​ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమృత్​పాల్​ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించారు పోలీసులు. సోమవారం మధ్యాహ్నం వరకు పంజాబ్​లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్​ పంజాబ్​ దే' అధినేత అమృత్​పాల్ సింగ్ కోసం పంజాబ్​ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా పోలీసులు ప్రకటించారు. అమృత్‌పాల్ స్వస్థలమైన అమృత్‌సర్​లోని జల్లుపుర్‌ ఖేరాలో అతడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు.. రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు సేవలు నిలిపివేత ఉండగా.. దాన్ని సోమవారం మధ్యాహ్నం వరకు పొడగించింది. బ్యాంకింగ్, వైద్యం, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు బ్రాడ్​బ్యాండ్ సేవలను నిలిపివేయడం లేదని పేర్కొంది. ప్రస్తుతం యావత్​ పంజాబ్ రాష్ట్రం.. పోలీసు పహారాలో ఉంది. 'అమృతపాల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తాం. అమృత్​పాల్​కు చెందిన రెండు వాహనాలను సీజ్ చేశాం. అలాగే భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం' అని జలంధర్ పోలీస్ కమిషనర్ కుల్దీప్ సిన్హా చాహల్ అన్నారు.

పహారా కాస్తున్న పంజాబ్ పోలీసులు

పంజాబ్‌లో అరెస్టైన ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ నలుగురు అనుచరులను ప్రత్యేక విమానంలో అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు కోరారు. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటి వరకు ఖలీస్థానీ నేత అమృత్‌ పాల్‌ అనుచరుల్లో 78 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అతడి ఆర్థిక వ్యవహారాలను చూసుకునే దల్జీత్‌ సింగ్‌ కూడా ఉన్నాడు. దల్దీత్ సింగ్​ను హరియాణాలోని గురుగ్రామ్​లో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అమృత్‌పాల్‌కు సెక్యూరిటీగా ఉన్న మరో ఏడుగురిని సైతం పోలీసులు పట్టుకున్నారు.

అమృత్​పాల్ సింగ్ కోసం గాలిస్తున్న పోలీసులు

ఆ ఏడాది ఫిబ్రవరిలో 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్​పాల్​ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసం సృష్టించి.. తమ మద్దతుదారుడిని విడుదల చేయించుకున్నారు. అమృత్​పాల్​ పిలుపుతో.. వేలాది మంది అనుచరులు తల్వార్లు, తుపాకులతో అజ్నాలా పోలీస్​ స్టేషన్​ను ముట్టడించారు. అమృత్​పాల్ సింగ్​ సన్నిహితుడు లవ్​ప్రీత్​ తుఫాన్​ అరెస్టుకు నిరసనగా వారంతా ఇలా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయుధాలతో పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్​కు చేరుకున్న మద్దతుదారులు.. తల్వార్లతో పోలీసులపై దాడి చేస్తూ స్టేషన్​లోకి చొచ్చుకెళ్లారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిరసనకారుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వీరి ఆందోళనలకు తలొగ్గిన పోలీసులు.. లవ్​ప్రీత్ తుఫాన్​ను విడుదల చేశారు. అయితే, తమకు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే లవ్​ప్రీత్​ను విడుదల చేశామని అమృత్​సర్ ఎస్ఎస్పీ వెల్లడించారు.

'వారీస్ పంజాబ్ దే' వివాదాలు..
'వారీస్ పంజాబ్ దే'ను ఖలిస్థాన్ అనుకూల సంస్థగా చెబుతుంటారు. మత బోధకుడిగా చెప్పుకునే ఆ సంస్థ అధినేత అమృత్​పాల్ సింగ్ ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. దొంగతనం, కిడ్నాప్, హింసకు పాల్పడటం వంటి కేసులు అమృత్​పాల్ సింగ్​పై నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details