రాహుల్ గాంధీ X పోలీసులు.. దిల్లీలో హైడ్రామా!

author img

By

Published : Mar 19, 2023, 12:45 PM IST

Updated : Mar 19, 2023, 6:43 PM IST

rahul gandhi bharat jodo yatra

దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి రాహుల్​ గాంధీ వర్సెస్​ పోలీసులుగా మారింది. భారత్​ జోడో యాత్రలో ప్రస్తావించిన అత్యాచార బాధితుల వివరాల కోసం కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఈ నోటీసులపై రాహుల్ స్పందించారు.

భారత్​ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు చిలికిచిలికి గాలి వానలా మారాయి. పరిస్థితి రాహుల్​ గాంధీ వర్సెస్​ దిల్లీ పోలీసులుగా మారింది. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆదివారం నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు. అయితే దాదాపు రెండు గంటలపాటు ప్రత్యేక బృందం వేచి చూశాక.. రాహుల్​ వారిని కలిసినట్లు సమాచారం. జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్రలో భాగంగా కొందరు అత్యాచార బాధితుల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించాలని కాంగ్రెస్​ అగ్రనేతను దిల్లీ పోలీసులు కోరారు.

నోటీసులకు స్పందించిన రాహుల్​
దిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్​ జోడో యాత్రలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు 4 పేజీలు, 10 పాయింట్లతో లేఖ రాశారు. 8-10 రోజుల్లో పూర్తి వివరాలు సమర్పిస్తానని అందులో పేర్కొన్నారు. అదానీ వ్యవహారంపై తాను పోరాడినందుకే ఇలా చేశారన్నారు.

ఆ లేఖలో ఏం లేదు : దిల్లీ పోలీసులు
మరోవైపు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్ గాంధీ నుంచి సమాధానం వచ్చిందని తెలిపారు దిల్లీ పోలీసులు. కానీ ఈ లేఖలో ఆయన ఎలాంటి సమాచారం తెలపలేదని.. దీని వల్ల దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. వచ్చే 8-10 రోజుల్లో పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని మాత్రమే లేఖలో పేర్కొనట్లు వెల్లడించారు.

అంతకుముందు రాహుల్​ ఇంటికి దిల్లీ పోలీసులు పెద్ద సంఖ్యలో వెళ్లడంపై తీవ్ర దుమారం రేగింది. రాహుల్ నుంచి బాధితుల వివరాలు తెలుసుకుని.. ఆ బాధితులకు న్యాయం చేసే ఉద్దేశంతోనే వచ్చినట్లు దిల్లీ ప్రత్యేక కమిషనర్‌ ఎస్పీ హూడా తెలిపారు. రాహుల్‌కు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అగ్రనేత ఇంటికి వచ్చినట్లు ప్రత్యేక పోలీసు కమిషనర్‌ హూడా తెలిపారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసు బలగాలు రాహుల్​ ఇంటి వద్ద మోహరించాయి. అయితే రాహుల్​ ఇంటికి పోలీసులు చేరుకున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని.. ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ నేతలకు కూడా ఇలానే చేయాలి : కాంగ్రెస్​
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకుని నోటీసులు జారీ చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. రాజకీయ కక్షతోనే రాహుల్​ను వేధిస్తున్నారని ఆరోపించింది. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​, సీనియర్​ నేత జైరాం రమేశ్​ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా దిల్లీ పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడతారా అని గహ్లోత్​ ప్రశ్నించారు. 8-10 రోజుల్లో వివరాలన్నీ అందిస్తానని రాహుల్​ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ యాత్రల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్​కు బీజేపీ కౌంటర్​
కాంగ్రెస్​ పార్టీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది బీజేపీ. కాంగ్రెస్​ ప్రతి విషయానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెబుతోందని ఆ పార్టీ నేత సంబిత్​ పాత్రా విమర్శించారు. "ఓ మహిళ అత్యాచారానికి గురైందని ఓ ఎంపీగా రాహుల్​ చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే హక్కు పోలీసులకు ఉంది. అందుకే రాహుల్​ ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చి.. ఆ మహిళకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగారు." అని సంబిత్​ పాత్రా స్పష్టం చేశారు.

ఈనెల 16న నోటీసులు..
భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్‌లో పర్యటించిన రాహుల్‌.. తన యాత్రలో అనేక మంది మహిళలు తనతో సమావేశమయ్యారని చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ అత్యాచారాలకు గురవుతున్నట్లు సదరు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిల్లీ పోలీసులు ఆయనకు మార్చి 16న నోటీసులు జారీచేశారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చేసుకుని ఈ నోటీసులు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ బాధితుల వివరాల కోసమే రాహుల్ గాంధీని ప్రశ్నించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత మహిళల వివరాలు అందిస్తే దానికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు కోరారు.

ఇటీవలే రాహుల్​ గాంధీ లండన్​లో చేసిన వ్యాఖ్యలకు కారణంగా పార్లమెంట్​లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో.. పోలీసులు ఆయన ఇంటికి చేరుకోవడం ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. లండన్​ వేదికగా 'భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది' అని రాహుల్​ గాంధీ అన్న వ్యాఖ్యలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని రాహుల్ గాంధీ కోరారంటూ.. బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే రెండో దశ పార్లమెంట్​ సమావేశాల్లో రాహుల్​ వ్యాఖ్యలు చర్చకు రావడం వల్ల ఉభయ సభల్లో బీజేపీ, కాంగ్రెస్​ సభ్యులకు మధ్య మాటల యుద్ధం చెలరేగింది. దీంతో గత సోమవారం ప్రారంభమైన రెండో దశ బడ్జెట్​ సమావేశాలు దాదాపు వారం రోజులుగా వాయిదా పడుతూనే వస్తున్నాయి. బీజేపీ సభ్యులు రాహుల్ వ్యాఖ్యలు లేవనెత్తి క్షమాపణలు చేప్పాలని కోరగా.. ప్రతిపక్షాలు అదానీ వ్యవహారంలో పార్లమెంటరీ కమిటీ జోక్యాన్ని కోరుతున్నాయి. దీంతో ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది.

Last Updated :Mar 19, 2023, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.