తెలంగాణ

telangana

వాడీవేడిగా శీతాకాల సమావేశాలు.. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం..

By

Published : Dec 6, 2022, 2:18 PM IST

Parliament Winter Session 2022 : పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈనెల 29 వరకు జరిగే ఈ సమావేశాలపై గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలవ పతనం, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని అంశాలపై సమాధానం చెప్పేందుకు సిద్ధమన్న కేంద్రం.. సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్ష భేటీలో కోరింది.

parliament winter session 2022
parliament winter session 2022

Parliament Winter Session 2022 : పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 29 వరకు జరగనున్న ఈ సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉభయ సభలు మొత్తం 17రోజులపాటు సమావేశం కానుండగా.. కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులు ప్రవేశపెట్టనుంది. వాటిలో బయోలాజికల్ డైవర్సిటీ, మల్టీ-స్టేట్ కోపరేటివ్ సొసైటీలు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఈ మూడు బిల్లులను స్థాయీసంఘం పరిశీలనకు పంపాలని.. వాటిపై మరింత విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు.

శీతాకాల సమావేశాల్లో దేశ ఆర్థిక పరిస్థితి, రాజ్యాంగ సంస్థలను బలహీనపర్చడం, సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ఈడబ్ల్యూఎస్​ కోటా అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, రూపాయి మారకపు విలవ పతనం, ఎగుమతుల తగ్గుదల, ఇండో-చైనా సరిహద్దు సమస్య, అధిక జీఎస్​టీ పన్నుల అంశాలు కూడా ప్రస్తావిస్తామని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర విపక్షాల నేతలు తెలిపారు.

అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు

శీతాకాల సమావేశాల్లో కోఆపరేటివ్‌ సొసైటీల్లో జవాబుదారీతనాన్ని పెంచడం, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చే బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ బిల్లు, నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు, కంటోన్‌మెంట్‌ బిల్లు, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో విపక్షాలు ప్రస్తావించే అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు అఖిలపక్ష భేటీ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ చెప్పారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ప్రస్తుత పార్లమెంటు భవనంలో శీతాకాల సమావేశాలే చివరివి కాగా.. వచ్చే బడ్జెట్‌ సమావేశాలను నూతన భవనంలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరుకాబోరని తెలుస్తోంది.

అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు
అఖిలపక్ష సమావేశానికి వస్తున్న రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​

ఇవీ చదవండి:బీఆర్ అంబేడ్కర్‌కు ప్రముఖుల ఘన నివాళులు

చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన ముఖ్యమంత్రి వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details