తెలంగాణ

telangana

ఒడిశా ఘోర ప్రమాదంపై ప్రధాని సమీక్ష.. ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ

By

Published : Jun 3, 2023, 11:43 AM IST

Updated : Jun 3, 2023, 12:57 PM IST

Odisha Train Accident : ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. శనివారమే ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఘటనలో గాయాలపాలైన బాధితులను మోదీ పరామర్శిస్తారు

Odisha Train Accident
Odisha Train Accident

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత సమావేశం నిర్వహించారు. కీలక అధికారులతో ఆయన భేటీ అయి ప్రస్తుత పరిస్థితిపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలిలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బాలేశ్వర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రధాని శనివారం ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తొలుత మధ్యాహ్నం 2.30 గటంల సమయంలో 3 రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనాస్థలానికి మోదీ చేరుకుంటారు. అక్కడ పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తారు. అనంతరం ఘటనలో గాయాలపాలైన బాధితులను మోదీ పరామర్శిస్తారు. ఇందుకు కటక్‌లోని ఆస్పత్రికి మోదీ వెళ్లనున్నారు.

Odisha Train Tragedy : మరోవైపు ఈ ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఈ సమీక్ష సమావేశంలో ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం మోదీ గోవాలో వందే భారత్ రైలును ప్రారంభించాల్సి ఉన్నా.. ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు, స్వల్పగాయాలైన వారికి 50వేలు అందించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

Ashwini Vaishnaw Odisha : ఒడిశా బాలేశ్వర్​లో మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటనకు కారణాలను ప్రస్తుతానికి చెప్పలేమని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాద కారణాలు తెలుస్తాయని చెప్పారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి.. ప్రస్తుతం సహాయక చర్యలపైనే పూర్తిగా దృష్టిసారించామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వివరించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

"ఆగ్నేయ రైల్వే సర్కిల్ సేఫ్టీ కమిషనర్​ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా అన్నది ప్రస్తుతానికి చెప్పలేం. రైల్వే కమిషనర్ నివేదిక సమర్పించిన తర్వాతే ఘటనకు గల కారణాలు తెలుస్తాయి."

--అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి

పలు రాష్ట్రాల సీఎంలు సమీక్ష
ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై పలు రాష్ట్రాల సీఎంలు సమీక్ష నిర్వహించగా.. మరికొందరు ముఖ్యమంత్రులు స్వయంగా ప్రమాదస్థలికి వెళ్లి పరిశీలించారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. శనివారం ప్రమాదస్థలిని పరిశీలించనున్నారు. ఇప్పటికే నవీన్ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడిన మమత.. ఎలాంటి సాయమైనా చేస్తామని హామీ ఇచ్చారు. రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌.. మంత్రుల బృందాన్ని ఒడిశాకు పంపారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు.. హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశాయి. చాలా రాష్ట్రాలు తమ బృందాలను ప్రమాద స్థలికి పంపి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

ఇవీ చదవండి:ఒడిశా దుర్ఘటన.. గూడ్స్​ రైలుపైకి దూసుకెళ్లిన ఇంజిన్.. ఫొటోలు చూశారా?

Odisha Train Accident : పరిమళించిన మానవత్వం.. అర్ధరాత్రి వేలమంది రక్తదానం

Last Updated :Jun 3, 2023, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details