తెలంగాణ

telangana

అల్మారాల్లో నోట్ల గుట్టలు- రూ.220కోట్లు సీజ్​- ప్రతి పైసా కక్కిస్తామన్న మోదీ

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 9:25 PM IST

Odisha IT Raids : ఒడిశాకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. మూడు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ జరుపుతున్న ఈ సోదాల్లో శుక్రవారం వరకూ రూ.220 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల నుంచి తీసుకున్న ప్రతి పైసా కక్కిస్తామని పేర్కొన్నారు.

Etv Bharat
Odisha IT Raids

Odisha IT Raids :పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని మద్యం వ్యాపారి ఇంటిపై గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు శుక్రవారం 156 బ్యాగుల నిండా నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా స్వాధీనం చేసుకున్న బ్యాగుల్లో ఆరేడు బ్యాగులను మాత్రమే లెక్కించామని, వీటిల్లో రూ.20 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రూ.220 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సంబల్‌పుర్‌, బోలన్‌గిరి, టిట్లాగఢ్‌, బౌద్ధ్‌, సుందర్‌గఢ్‌, రవూర్కెలా, భువనేశ్వర్‌లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాలపై సదరు మద్యం కంపెనీ ఇంతవరకు స్పందించలేదు.

'ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తాం'
మరోవైపు ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఎంపీకి కూడా లిక్కర్‌ కంపెనీతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. రాంచీలోని ఆయన కార్యాలయానికి వెళితే ఎంపీ అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ సామాజిక మధ్యమం ఎక్స్‌ ద్వారా స్పందించారు. నోట్ల కట్టలు బయటపడ్డ వార్తకు సంబంధించిన క్లిప్పింగును ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నోట్ల గుట్టలను చూసి నాయకులు చెప్పే నీతి వాక్యాలు వినాలని వ్యంగ్యంగా అన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ హామీ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

'సోనియా, రాహుల్​ స్పందించరేం?'
మద్యం కంపెనీకి చెందిన నల్లధనం వ్యవహారంలో ఝార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్ సాహుపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ఎంపీకి చెందిన రూ.200 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఐటీ అధికారులు పట్టుకుంటే సోనియా, రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడుంటే అక్కడ అవినీతి ఉంటుందని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే కాంగ్రెస్‌ నేతలు ED, CBIపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారని ధ్వజమెత్తారు.

బీజేపీ X బీజేడీ
అటు మద్యం కంపెనీ వ్యవహారంలో ఒడిశా ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. స్థానిక నేతలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ స్థాయిలో పన్ను ఎగవేయడం అసాధ్యమని బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్‌ మహాపాత్రో విమర్శించారు. ఈ ఆరోపణలను బిజూ జనతాదళ్‌ ఖండించింది.

ABOUT THE AUTHOR

...view details