పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu news).. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న లాంటి వారని అన్నారు. కర్తార్పుర్ను సందర్శించడానికి పాక్ వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భాజపా తీవ్ర స్థాయిలో మండిపడింది. సిద్ధూ మాటలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఐఎస్, బోకోహారం సంస్థలను హిందుత్వతో ముడిపెట్టిన కాంగ్రెస్ నేతలు.. ఇమ్రాన్ను మాత్రం పెద్దన్న అని పిలవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు(Navjot Singh Sidhu latest news ). హిందుత్వపై విమర్శలు గుప్పించే రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల తరహాలోనే సిద్ధూ మాట్లాడారని విమర్శించారు. కేవలం బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తారన్నారు. పాకిస్థాన్ను పొగిడితే భారత్లో ఓ వర్గం సంతోషిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తారని, కానీ అలాంటి వారు ఇక్కడ లేరనే విషయం ఆ పార్టీ తెలుసుకోవాలని హితవు పలికారు.
భాజపా ఐటీ సెల్ ఇంఛార్జ్, బంగాల్ కో-ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ కూడా ట్విట్టర్ వేదికగా సిద్ధూపై ధ్వజమెత్తారు.
" రాహుల్ గాంధీకి ఎంతో ఇష్టమైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పాక్ ప్రధానిని బడా భాయ్ అన్నారు. పోయినసారి పాక్ ఆర్మీ చీఫ్ భజ్వాను ఆలింగనం చేసుకుని ప్రశంసలు కురిపించారు. సీనియర్ నేత అమరీందర్ సింగ్ను కాదని గాంధీ సోదరులు సిద్ధూను ఎంచుకోవడంలో ఆశ్చర్యమేముంది?"
-అమిత్ మాలవియ ట్వీట్.
తప్పేముంది...
పాక్ ప్రధానిని సోదరుడు అని సిద్ధూ(Navjot Singh Sidhu latest news ) పిలిస్తే తప్పేంటని పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పాకిస్థాన్కు వెళ్తే మాత్రం దేశ ప్రేమికుడు అని అంటారు, సిద్ధూ వెళ్తే మాత్రం దేశ ద్రోహి అంటారా? అని మండిపడ్డారు. సోదరుడు అని పిలవడం తప్పా? అన్నారు. గురునానక్ దేవ్ సిద్ధాంతాలనే తాము అనుసరిస్తామని పేర్కొన్నారు.
సరిహద్దులు తెరవాలి..
ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చొరవ వల్లే కర్తార్పుర్ నడవా తిరిగి తెరుచుకుందని సిద్ధూ అన్నారు(navjot singh sidhu news today). కర్తార్పుర్ సాహిబ్ను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. పంజాబ్ బాగుపాడలంటే వాణిజ్య కార్యకాలాపాల కోసం సరిహద్దులను తిరిగి తెరవాలన్నారు. పంజాబ్ నుంచి పాకిస్థాన్కు 21కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు 2100 కిలోమీటర్ల దూరం ఉన్న ముంద్ర పోర్టు నుంచి వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ నేత్వతంలోని కేబినెట్ మంత్రుల బృందం నవంబర్ 18 కర్తార్పుర్ను సందర్శించడానికి వెళ్లింది. ఈ జాబితాలో సిద్ధూ పేరు లేకపోవడం రాష్ట్ర కాంగ్రెస్లో మరో వివాదానికి దారి తీసింది(punjab congress crisis). అనంతరం రెండు రోజుల తర్వాత కర్తార్పుర్ను సందర్శించేందుకు సిద్ధూ శనివారం ప్రత్యేకంగా పాకిస్థాన్కు వెళ్లారు.
పంజాబ్ గురాదస్పుర్ జిల్లాలోని డేరాబాబా ననక్, పాకిస్థాన్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ను కలిపేదే కర్తార్పుర్ కారిడార్. కొవిడ్ కారణంగా 2019లో మూసివేసిన దీన్ని నవంబర్ 17నే తిరిగి తెరిచారు. 4.7కిలోమీటర్లున్న ఈ కారిడార్ ద్వారా సిక్కులు తమ గురుదైవమైన గురునానక్ దేవ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
2018లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధూ అతిథిగా వెళ్లారు. అప్పుడే వీరిద్దరి మధ్య బంధం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి:అజయ్ మిశ్రా హాజరయ్యే సమావేశానికి మోదీ రావొద్దు: ప్రియాంక