Presidential election 2022: ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరిగే దేశ ప్రథమ పౌరుడి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4,800 మంది కాగా మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్నారు. అటు ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. పోలింగ్ సామగ్రిని పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు తరలించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉండటం వల్ల వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా ఆకుపచ్చ, పింక్ బ్యాలెట్ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది. గ్రీన్ బ్యాలెట్ పేపర్లో ఎంపీలు., పింక్ పేపర్లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేయనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువలను 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా నిర్ధరిస్తారు. జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది. దీని ప్రకారం.. యూపీకి చెందిన సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా.. ఝార్ఖండ్-తమిళనాడు రాష్ట్రాలకు అది 176గా ఉంది. అలాగే మహారాష్ట్రలో 175, సిక్కిం 7, మిజోరాం 8, నాగాలాండ్లో 9గా ఎమ్మెల్యే ఓటు విలువ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. ప్రస్తుతం సగటు ఎంపీ ఓటు విలువ 700గా ఉంది. దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ మొత్తంగా.. 10,86,431గా ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.