వేల కోట్ల రూపాయల అప్పును ఎగవేసి.. విదేశాలకు వెళ్లిపోతున్న వారి గురించి రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాము. అలాంటి ఈ కాలంలో.. రూ. 28 అప్పును చెల్లించడం కోసం విదేశాల నుంచి భారత్కు వచ్చారు ఓ వ్యక్తి. 68 ఏళ్ల తర్వాత అప్పును వడ్డీతో సహా తీర్చేశారు. హరియాణా హిసార్లో జరిగింది ఈ ఘటన.
అమెరికా టు ఇండియా..
బీఎస్ ఉప్పల్ బాల్యం అంతా హిసార్లోనే గడిచింది. అక్కడే ఉన్న హర్జిరామ్ హిందూ పాఠశాలలో ఆయన 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. ఆయన ఇంటి దగ్గర 'దిల్లీ వాలా హల్వాయి' అనే దుకాణం ఉండేది. అక్కడ ఎప్పుడూ లస్సీ తాగేవారు. 1954లో ఒకసారి అత్యవసరంగా హిసార్ను వీడాల్సి వచ్చింది. అప్పటికే ఆ దుకాణ యజమానికి బీఎస్ ఉప్పల్.. రూ.28 అప్పు ఉన్నారు. ఊరు మారినా ఆ విషయాన్ని ఆయన మర్చిపోలేదు. ఆ తర్వాత ఆయన నేవీలో చేరారు. హిసార్కు తిరిగి వెళ్లడం కుదరలేదు. ఇక రిటైర్మంట్ తర్వాత కుమారుడితో కలిసి బీఎస్ ఉప్పల్.. అమెరికాలో స్థిరపడ్డారు.