తెలంగాణ

telangana

రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. చివరకు ఆ రాష్ట్రంలోనూ...

By

Published : Jul 22, 2022, 1:32 PM IST

Updated : Jul 22, 2022, 2:25 PM IST

President election cross voting: రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. విపక్షాలకు చెందిన దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు ఓటు వేసినట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్రాల్లో ఈ తరహా ట్రెండ్‌ కనిపించింది. మొత్తం ఓట్లన్నీ విపక్ష అభ్యర్థికే పడడం ఖాయమని భావించిన కేరళలోనూ ద్రౌపదికి ఒకరు మద్దతు తెలపడం విశేషం.

president election 2022
రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

President election cross voting: 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు అంచనా వేసిన దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. విపక్షాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆమెకు జైకొట్టడమే ఇందుకు కారణం. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీలు విప్‌ జారీ చేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. విపక్ష పార్టీలకు చెందిన దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ద్రౌపదీ ముర్ముకు మద్దతునిచ్చినట్లు తెలుస్తోంది.

కేరళలో భారతీయ జనతా పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అక్కడ అధికార పక్షం ఎల్​డీఎఫ్, విపక్షం యూడీఎఫ్ రెండూ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే మద్దతునిచ్చాయి. అయినా కేరళలో పోలైన 140 ఓట్లలో ఒక ఓటు ద్రౌపదీ ముర్ముకు పడటం గమనార్హం. అసోంలో విపక్షానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ద్రౌపదీ ముర్ముకు ఓటేశారు. అసోం అసెంబ్లీలో 126 మంది సభ్యులు ఉండగా అక్కడ భాజపా బలం 79. కానీ ద్రౌపదీ ముర్ముకు అసోంలో 104 ఓట్లు వచ్చాయి. అసోంలో ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం హిమంత్‌ బిశ్వ శర్మ ట్వీట్‌ చేశారు.

మధ్యప్రదేశ్‌లో ద్రౌపదీ ముర్ముకు అదనంగా 16 ఓట్లు వచ్చాయి. అక్కడ ముర్ముకు 146, యశ్వంత్‌ సిన్హాకు 79 ఓట్లు పోలయ్యాయి. భాజపా ఎమ్మెల్యేల సంఖ్య కంటే ద్రౌపదీ ముర్ముకు ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆత్మసాక్షి ప్రకారం ఓటేసిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వీడియో సందేశం విడుదల చేశారు. పశ్చిమ బంగాల్‌లో భాజపాకు 69 మంది ఎమ్మెల్యేలే ఉండగా అక్కడ ద్రౌపదీ ముర్ముకు 71 ఓట్లు రావడం గమనార్హం. సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌లోనూ యశ్వంత్‌ సిన్హా.. విపక్ష ఎమ్మెల్యేల అన్ని ఓట్లు దక్కించుకోలేకపోయారు. ఝార్ఖండ్‌లోని 81 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 9 మందే యశ్వంత్‌ సిన్హాకు మద్దతు పలికారు.

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన బలపరీక్షలో నెగ్గిన సీఎం ఏక్‌నాథ్‌ శిందేకు 164 ఓట్లు రాగా రాష్ట్రపతి ఎన్నికలో ద్రౌపదీ ముర్ముకు అక్కడ 181 ఓట్లు రావడం గమనార్హం. శివసేనలో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం కూడా ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం అందుకు కారణంగా తెలుస్తోంది. మేఘాలయలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ముర్ముకు క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. మణిపూర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎన్డీఏ అభ్యర్థికి జైకొట్టారు.

బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్షాలకు చెందిన ఆరుగురేసి ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటు వేయగా.. గుజరాత్‌లో 10, గోవాలో 4 ఓట్లు ఇలా అదనంగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌లో యశ్వంత్‌ సిన్హాకు ఒక్క ఓటుకూడా రాలేదు. మొత్తంగా ద్రౌపదీ ముర్ము 2 వేల 824 ఓట్లు సాధించారు. ఆ ఓట్ల విలువ 6 లక్షల 76 వేల 803. యశ్వంత్‌ సిన్హాకు 1,877 ఓట్లు దక్కాయి. వాటి విలువ 3 లక్షల 80 వేల 177. మొత్తం ఓట్లలో ద్రౌపదీ ముర్ముకు 64 శాతం, యశ్వంత్‌ సిన్హాకు 36 శాతం వచ్చాయి.

రాష్ట్రపతి ఎన్నికైన ముర్ము ఇంటికి వెళ్లి ఆమెను అభినందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
భారత తదుపరి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైనట్లు పత్రాలపై సంతకాలు చేసి చూపుతున్న సీఈసీ రాజీవ్​ కుమార్​, ఎన్నికల కమిషనర్​ అనూప్​ చంద్ర పాండే

ఇవీ చదవండి:ప్రథమ పీఠంపై గిరి పుత్రిక.. భారీ ఆధిక్యంతో ముర్ము ఘన విజయం

భారీ కుట్ర భగ్నం.. 2 కిలోల యురేనియంతో చిక్కిన స్మగ్లర్లు.. 15 మంది అరెస్ట్​

Last Updated : Jul 22, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details