Gobar Paint Jharkhand :ఆవు పేడతో ఎన్నెన్ని లాభాలున్నాయో మనకు తెలియంది కాదు. ఒక ఇంధనంగా, ఎరువుగా, బయోగ్యాస్ తయారీలో... ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. మన ముందు తరాలవాళ్లయితే... ఇల్లు, గోడలను పేడతో అలకడాన్ని సంప్రదాయంగా పాటించేవారు. ఇది క్రిమిసంహారకంగా పనిచేస్తుందని నమ్మేవారు. ప్రస్తుతం సింథటిక్ పెయింట్లనే అందరూ వాడుతున్నారు. దానికి బదులుగా రసాయనరహితమైన ఆవుపేడతో పెయింట్ తయారు చేస్తున్నాడు ఝార్ఖండ్కు చెందిన అభిషేక్ సింగ్.
కాలానుగుణంగా పల్లెలు, పట్టణాల్లోనివారు ఈ సంస్కృతులకు దూరమయ్యారు. ఇప్పుడు అభిషేక్ స్టార్టప్ కారణంగా... రాంచీ, ధన్బాద్లాంటి నగరాల్లోనూ పేడతో తయారయ్యే పెయింట్ను విరివిగా వాడుతున్నారు. తాము చేస్తున్న ప్రాకృతిక్ పెయింట్ చౌక ధరకే లభ్యమవడమే కాకుండా... మన్నికలోనూ దేనికీ తీసిపోదంటున్నాడీ యువకుడు. పర్యావరణ పరిరక్షణతో పాటు, పశుకాపరుల ఉపాధికీ కృషి చేస్తున్నాడు.
బహుళజాతి సంస్థలో పనిచేసినా..
ధన్బాద్కు చెందిన అభిషేక్ సింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. భూషణ్ స్టీల్, జిందాల్, వేదాంతలాంటి బహుళజాతి కంపెనీల్లో పనిచేసినా... ఏదో తెలియని అసంతృప్తి. ప్రజలకే కాకుండా పర్యావరణానికి మేలు చేసేలా ఓ స్టార్టప్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. విభిన్నంగా ఆలోచించి... ప్రాకృతిక్ పెయింట్ కంపెనీని మొదలుపెట్టాడు. ఆ వివరాలేంటో తన మాటల్లోనే విందాం.
"ప్రాకృతిక పెయింటింగ్ గురించి మేం యూట్యూబ్, ఇంటర్నెట్లో చూశాం. ఇవి చాలా విభిన్నమైన ఉత్పత్తులు. ఆవు పేడతో చిత్రలేఖనం వేసేవారు, కానీ పెయింట్ తయారీ గురించి ఎవరూ ఆలోచించలేదు. ఈ దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ముందడుగు వేశారు. ఆవు పేడతో పెయింట్ తయారీ విభిన్నంగా ఉంటుంది, దాన్ని మేం కూడా చేయాలని భావించాం. తద్వారా ఉపాధి కూడా కల్పించవచ్చని భావించాం. దీనికి సంబంధించి జైపుర్లో కుమారప్ప సంస్థలో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాం. ఆవు పేడ తయారీ కేంద్రం ఎలా ఏర్పాటు చేయాలి. సామాగ్రి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే అంశంపై అక్కడి నుంచి మేం సమాచారం సేకరించాం. ఆ తర్వాత ధన్బాద్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం."
--అభిషేక్ కుమార్ సింగ్, స్టార్టప్ యజమాని
జైపుర్లో శిక్షణ తీసుకుని..
జైపుర్లోని కుమరప్పలో శిక్షణ అనంతరం... PMEGP కింద పొందిన బ్యాంకు రుణంతో 2022లో ధన్బాద్లో సొంత ఫ్యాక్టరీ తెరిచాడు అభిషేక్. పశువుల మేతకు అక్కరకొచ్చేలా... కిలో ఆవుపేడకు 5 రూపాయల చొప్పున పశుకాపర్ల నుంచి కొనుగోలు చేస్తున్నాడు. ఒకప్పుడు పశుపోషణ భారంగా భావించినవారికి బాసటగా నిలుస్తున్నాడు. దీంతో పాలివ్వడం మానేసినా.. పశువులను రోడ్లపై వదలివేయటం వేయటంలేదని చెబుతున్నాడు.