తెలంగాణ

telangana

విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్​రేప్.. పెట్రోల్ పోసి నిప్పు.. 2నెలలుగా చికిత్స పొందుతూ..

By

Published : May 31, 2023, 10:24 AM IST

అత్యాచారానికి గురైన బాధితురాలు కాలిన గాయాలతో రెండు నెలల పాటు చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

gang rape in sultanpur
gang rape in sultanpur

ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​లో దారుణం జరిగింది. రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడిన అత్యాచార బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అత్యాచారం చేసిన తర్వాత.. బాధితురాలి ఒంటికి కామాంధులు నిప్పంటించారు. తీవ్రమైన కాలిన గాయాలతో బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 30న జైసింగ్​పుర్​కు చెందిన ఓ విద్యార్థినిని బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు.. అతడి సన్నిహితుల సాయంతో కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను గుజరాత్​లోని సూరత్​కు ఎత్తుకెళ్లిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడితోపాటు అతడి సన్నిహితులపై కేసు నమోదు చేశారు. మార్చి 28న మహావీర్, మరికొందరు వ్యక్తులు.. విద్యార్థినిపై అత్యాచారం చేశారు. బాధితురాలు వారికి ఎదురుతిరగడం వల్ల ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె శరీరం 60 శాతం కాలిపోయింది.

ఈ విషయాన్ని నిందితుడు మహావీర్​.. బాధితురాలి తండ్రికి ఫోన్​లో తెలియజేశాడు. మార్చి 29న బాధితురాలి తండ్రి.. సుల్తాన్​పుర్​ ఎస్పీ సోమన్ వర్మను కలిసి జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బృందం సూరత్​కు చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని లఖ్​నవూలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సూరత్​ సహా ఉత్తర్​ప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆఖరికి జయ్​సింగ్​పుర్​లో మహావీర్​, ధనిరామ్​ను పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు.

కాలిన గాయాల కొంత తగ్గడం వల్ల బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు మే 16న ఇంటికి తీసుకువచ్చారు. అయితే మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు బిర్సింగ్​పుర్​లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందతూ బాధితురాలు మంగళవారం రాత్రి మరణించింది. పోలీసుల ఆదేశాల మేరకు.. బాధితురాలి మృతదేహానికి పోస్ట్ మార్టం పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అనంతరం బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.

బాలికపై మైనర్ల గ్యాంగ్​రేప్​..
ఇటీవల త్రిపురలో 11 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని నిందితులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనకు సంబంధించి మే 29 తెల్లవారుజామున ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర త్రిపుర జిల్లా, ధర్మనగర్ సబ్​డివిజనల్ పరిధిలోని కదంతలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసు వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. మే 28న మధ్యాహ్నం 12 గంటలకు ఈ దారుణం జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details