తెలంగాణ

telangana

G20 Summit 2023 Delhi : భారీగా బలగాలు.. స్కూళ్లకు సెలవులు.. విమానాలు రద్దు.. దిల్లీలో లాక్‌డౌన్‌ పరిస్థితులు!

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 7:58 PM IST

G20 Summit 2023 Delhi Restrictions : అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీ నగరం కనీవినీ ఎరుగని భద్రత వలయంలోకి వెళ్తోంది. ప్రపంచ ఆర్థికంలో 75 శాతం వాటా కలిగిన జీ20 దేశాల అధినేతలు దిల్లీకి వస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో భారీగా బలగాలను మోహరించారు. సమావేశాలు జరిగే శుక్రవారం నుంచి ఆదివారం వరకు విద్యాసంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటించారు. రైళ్లు, విమానాలను పెద్ద సంఖ్యలో రద్దు చేశారు. సెంట్రల్‌ దిల్లీ అనధికార లాక్‌డౌన్‌లోకి వెళ్తోంది.

G20 Summit 2023 Delhi Restrictions
G20 Summit 2023 Delhi Restrictions

G20 Summit 2023 Delhi Restrictions : జీ20 శిఖరాగ్ర సదస్సుకు దిల్లీ నగరం ముస్తాబైంది. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల దేశాలకు అధినేతలు, వారి తరఫున ప్రతినిధులు.. దేశరాజధానికి వస్తుండటం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు, కేంద్ర బలగాలు నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.

160 దేశీయ విమాన సర్వీసులు రద్దు
Delhi Airport Restrictions :దిల్లీ నుంచి రాకపోకలు సాగించే 160 దేశీయ విమాన సర్వీసులు రద్దు కానున్నాయని దిల్లీ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ వెల్లడించింది. అంతర్జాతీయ సర్వీసుల్లో ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సదస్సు కోసం ఎయిర్‌ పోర్టులో అన్ని రకాల పరికరాలు, పార్కింగ్‌ సౌకర్యాలను సిద్ధంగా ఉంచారు. నిర్ణీత తేదీల్లో దిల్లీ విమానాశ్రయంలో ఛార్టర్డ్‌, బిజినెస్‌ జెట్‌ల రాకపోకలకు అనుమతి నిరాకరించనున్నారు. ఎమర్జెన్సీ కోసం లఖ్‌నవూ, జైపుర్‌, ఇందౌర్‌, అమృత్‌సర్‌లో 4 రిజర్వు ఎయిర్‌పోర్టులను సిద్ధంగా ఉంచారు.

విద్యుద్దీపాల అలంకరణ

70మంది వీవీఐపీ విమానాలు..
Delhi Airports News :సఫ్దర్‌గంజ్‌ ఎయిర్‌ పోర్టులో అత్యవసర, బ్యాకప్‌ విధుల కోసం ఎయిర్‌ఫోర్స్‌, ఎన్​ఎస్​జీ హెలికాప్టర్లను మాత్రమే అనుమతిస్తారు. అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు, బ్రిటన్‌, కెనడా ప్రధానులు సహా మొత్తం 70 మంది వీవీఐపీ విమానాలు పాలం టెక్నికల్‌ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ చేయనున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ సహా కొన్ని విమానాలను పాలం ఎయిర్‌ఫోర్ట్‌లో పార్క్‌ చేయనున్నారు.

గంట ముందే..
Delhi Airport Restrictions For G20 : విస్తారా, ఎయిరిండియాలు రీషెడ్యూలైన సర్వీసుల బుకింగ్స్‌ను మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. 8 నుంచి 11 తేదీల మధ్యలో ప్రయాణాల సమయంలో సర్వీసుల స్టేటస్‌లను జాగ్రత్తగా సరి చూసుకోవాలని విస్తారా సూచించింది. నిబంధనల దృష్ట్యా ప్రయాణికులు తొందరగా విమానాశ్రయానికి చేరుకోవాలనీ చెక్‌-ఇన్‌ కౌంటర్లను ప్రయాణానికి గంట ముందే మూసివేస్తామని స్పైస్‌జెట్‌ వెల్లడించింది.

మెట్రో టైమింగ్స్​లో మార్పులు..
Delhi Metro Restrictions : జీ20 శిఖరాగ్ర సదస్సు భద్రత దృష్ట్యా 8 నుంచి 10వ తేదీ వరకు దిల్లీ మెట్రో సర్వీసుల్లో మార్పులు చేయనున్నారు. మెట్రో నెట్‌వర్క్‌ అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమవుతాయి. సుప్రీంకోర్టు, పటేల్‌ చౌక్‌, ఆర్కే ఆశ్రమ్‌ మార్గ్‌ స్టేషన్లలో 8వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం వరకు పార్కింగ్‌లను నిషేధించారు.

రైళ్లు కూడా రద్దు..
Delhi Trains Cancelled For G20 : దేశ రాజధానిలో సెప్టెంబరు 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 207 రైళ్లను రద్దు చేయనున్నట్లు ఉత్తర రైల్వే ప్రకటించింది. మరో 36 రైళ్లను తాత్కాలికంగా మళ్లింపు చేయనున్నట్లు తెలిపింది.

నో వాకింగ్​.. సైక్లింగ్​..
Delhi Police Restrictions : దిల్లీ పరిసర ప్రాంతాల పౌరులకు జీ20 సదస్సు దృష్ట్యా.. పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇండియా గేట్‌, కర్తవ్యపథ్‌ ప్రాంతాల్లో నడవటం, సైక్లింగ్‌ వంటి కార్యకలాపాలతో పాటు విహార యాత్రలు చేయకూడదని స్పష్టం చేశారు. దిల్లీలో ఆన్‌లైన్‌ ద్వారా వైద్య సామాగ్రి డెలివరీకి మాత్రమే అనుమతిస్తున్నామనీ ఫుడ్‌ డెలివరికి అనుమతి లేదని తెలిపారు. ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో కాకుండా మెట్రోల్లోనే ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అతిధులకు స్వాగత బ్యానర్లు

35 ఫైర్​ ఇంజిన్లు.. 500 మంది సిబ్బంది..
Delhi G20 Control Rooms :దిల్లీలోని మూడు ముఖ్యమైన ప్రాంతాల్లో 35 ఫైర్‌ ఇంజిన్‌లతో కూడిన 500 మంది సిబ్బందిని ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ విడివిడిగా మోహరించింది. భారత్‌ మండపం, ప్రముఖ హోటల్‌తోపాటు ప్రసిద్ధ పర్యటక ప్రదేశంలో ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖ ఇప్పటికే మాక్ డ్రిల్స్‌ నిర్వహించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది. వర్షం పడితే నీటిని నిల్వకుండా చేసేందుకు..4 ప్రత్యేక హై ఓల్టేజ్‌ వాటర్‌ పంపింగ్‌ యంత్రాలను సిద్ధం చేసింది.

దిల్లీలో మోదీ హోర్డింగ్​

సీసీటీవీలో AI..
Delhi G20 Restrictions : దిల్లీలోకి అడుగుపెడుతున్న ప్రతీ ఒక్కరినీ స్కాన్‌ చేసే సీసీటీవీల్లో ముఖ గుర్తింపు సాంకేతికతను ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌తో జోడించారు. చిత్రాలతో పాటు ఆడియో డేటాను ఇది సేకరించగలదని పోలీసులు చెప్పారు. పోలీసు స్టేషన్‌లలో రికార్డయిన నేరస్థుల ఫొటోలతో ఇది సరిపోల్చుకుని అధికారులకు వెంటనే సమాచారం అందిస్తాయి.

ఎప్పటికప్పుడే..
Delhi G20 Security :జీ20 శిఖరాగ్ర సమావేశంలో దిల్లీలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హోటళ్ల నుంచి సదస్సు వేదిక వరకు ప్రతినిధుల కదలికలను ఇది సమన్వయం చేస్తుంది. ట్రాఫిక్ రద్దీ, స్థానిక కాలుష్య స్థాయి, రోడ్ల నిర్వహణ వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు అందించనుంది.

16వేల స్మార్ట్​ ల్యాంప్​లు..
Delhi Smart Lamps : న్యూదిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ప్రాంతంలో మొత్తం 16వేల స్మార్ట్‌ విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 97 వాహనాల కోసం స్మార్ట్‌ పార్కింగ్‌ ప్రాంతాల్ని ఎన్​డీఎంసీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 8వేల వాహనాలను పార్క్‌ చేసుకునే వీలు కల్పించారు. అంతేకాక 3వేల మంది సివిక్‌ వర్కర్లను నియమించారు.

దిల్లీలో స్మార్ట్​ ల్యాంప్​ల జిగేల్​లు..

స్కూళ్లు, కార్యాలయాలు బంద్​
Delhi Schools Closed : జీ20 సదస్సు కోసం కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేసిన క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా.. సెప్టెంబర్‌ 7 నుంచి పది వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే మానవ వనరుల అవసరాల దృష్ట్యా ఉపాధ్యాయులు ఇతర ప్రభుత్వ సిబ్బంది అనునిత్యం ఫోన్‌లో అందుబాటులో ఉండాలనీ, వారికి సెలవులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details