తెలంగాణ

telangana

'ఆ స్టేడియానికి మోదీ పేరు తీసేస్తాం.. 10లక్షల ఉద్యోగాలిస్తాం'.. కాంగ్రెస్ మేనిఫెస్టో

By

Published : Nov 12, 2022, 5:50 PM IST

Congress Manifesto Gujarat : భాజపా కంచుకోట గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్రమోదీ మైదానం పేరు మారుస్తామని హామీ ఇచ్చింది. 10 లక్షల ఉద్యోగాల కల్పన, మహిళలకు పీజీ వరకు ఉచిత విద్య, రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ, 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి హామీలు ఇచ్చింది.

gujarat elections 2022
గుజరాత్ ఎన్నికలు

Congress Manifesto Gujarat : ఎన్నికల వేళ గుజరాత్‌ ప్రజలపై కాంగ్రెస్‌ పార్టీ హామీల జల్లు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ గెలిస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ మైదానం పేరు మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు గుజరాత్‌ ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విడుదల చేశారు. మోదీ స్టేడియం పేరును సర్దార్‌ పటేల్‌ మైదానంగా మారుస్తామని తెలిపింది. గతంలో మెుతేరా పేరుతో ఉన్న మైదానాన్ని ఆధునీకరించిన భాజపా సర్కార్.. ఇటీవల దానికి నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేసింది. తాము అధికారంలోకి వచ్చిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే మేనిఫెస్టోకు అధికారిక ముద్రవేస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగిరితే 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తేల్చిచెప్పింది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు ఇస్తామని పేర్కొంది. 3వేల ప్రభుత్వ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు ప్రారంభిస్తామని.. మహిళలకు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది. వంటగ్యాస్‌ను రూ.500లకే అందించనున్నట్లు తెలిపింది.

ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధమహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీతో పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రజలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించింది. గుజరాత్‌ ప్రజలందరికీ గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు వైద్య సహాయం.. రూ.5లక్షల వరకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందిస్తామని పేర్కొన్నారు.

కొవిడ్‌ మృతులకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ తెలిపింది. గుజరాత్‌లో వేళ్లూనుకుపోయిన అవినీతికి అధికారంలోని భాజపా ప్రభుత్వందే బాధ్యత అని గహ్లోత్‌ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే గత 27 ఏళ్లుగా నమోదైన అవినీతి కేసులపై దర్యాప్తు జరిపించి బాధ్యులకు శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:ప్రశాంతంగా హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే?

మదర్సాలో దారుణం.. బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం.. రెండు నెలలుగా..

ABOUT THE AUTHOR

...view details