తెలంగాణ

telangana

'రూ.350 లంచం కేసు'.. 24ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టివేసిన హైకోర్టు

By

Published : Jul 2, 2022, 6:33 AM IST

24 ఏళ్ల క్రితం ఓ పోలీసు అధికారికి దిగువ కోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను బాంబే హైకోర్టు కొట్టివేసింది. రూ.350 లంచం తీసుకున్నట్లు 1988లో ఓ పోలీసు అధికారిపై కేసు నమోదైంది. ఫిర్యాదుదారు నుంచి అతడు తీసుకున్న సొమ్ము లంచమే అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని ధర్మాసనం పేర్కొంది.

mumbai bribery case
బాంబే హైకోర్టు

రూ.350 లంచం తీసుకున్నట్లు నమోదైన కేసులో ఓ పోలీస్‌ అధికారికి దిగువ కోర్టు 24 ఏళ్ల క్రితం విధించిన ఏడాది జైలు శిక్షను బాంబే హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఫిర్యాదుదారు నుంచి అతడు తీసుకున్న సొమ్ము లంచమే అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని ధర్మాససం వ్యాఖ్యానించింది. దామూ అవ్హాడ్‌ అనే వ్యక్తి 1988లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు.. ఓ కేసులో నిందితుడికి బెయిల్‌ ఇవ్వడానికి అతడి సోదరుడి నుంచి రూ.350 లంచంగా తీసుకున్నారన్నది అభియోగం. ఫిర్యాదుదారు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు సమాచారమివ్వగా వారు వలపన్నారు.

ఫిర్యాదుదారు నుంచి దామూ రూ.350 తీసుకోగానే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. 1998 ఆగస్టులో నాసిక్‌లోని ప్రత్యేక కోర్టు దామూను దోషిగా నిర్ధారించి ఏడాది జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ అదే ఏడాది దామూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్‌ బెంచ్‌ గురువారం దామూకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారు నుంచి నిందితుడు స్వీకరించిన సొమ్మును రికవరీ చేసినంత మాత్రాన అతడు లంచం తీసుకున్నట్లు నిర్ధారించలేమని పేర్కొంది. ఫిర్యాదుదారును నిందితుడు లంచం కోసం డిమాండ్‌ చేసి తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలని తెలిపింది. వాటిని ప్రాసిక్యూషన్‌ సమర్పించలేకపోయిందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details