తెలంగాణ

telangana

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ.. త్రిపుర ఎన్నికలే లక్ష్యంగా..

By

Published : Jan 27, 2023, 10:42 PM IST

Updated : Jan 27, 2023, 10:49 PM IST

BJP
భాజపా

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ సహా కీలక నేతలు పాల్గొన్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులను ఖరారు చేసేందుకు మూడు గంటలకుపైగా భేటీ అయ్యారు. మరోవైపు త్రిపుర టీఎంసీ మాజీ అధ్యక్షుడు, మరో సీపీఐ(ఎం) నేత కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) శుక్రవారం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఇతర పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల అభ్యర్థులను ఖరారు చేసేందుకు మూడు గంటలకుపైగా సమావేశమయ్యారు.

త్రిపుర టీఎంసీ మాజీ చీఫ్ సుబల్ భౌమిక్, సీపీఎం(ఎం) నేత మొబోషర్ అలీ భాజపాలో చేరారు. త్రిపుర సీఎం మాణిక్ సాహా, భాజపా నేత సంబిత్ పాత్రా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ ఇద్దరు నేతల చేరికతో పార్టీ మరింత బలపడుతుందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అన్నారు. వచ్చే ఎన్నికల్లో త్రిపురలో కచ్చితంగా భాజపానే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు వెలువడతాయి. అయితే త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనకు ముగింపు పలికి 2018లో తొలిసారిగా త్రిపురలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ ఏన్నికల్లో భాజపా 60 స్థానాలకుగాను 36 సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చింది.

Last Updated :Jan 27, 2023, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details