తెలంగాణ

telangana

'ఆన్​లైన్​లో డ్రగ్స్ స్మగ్లింగ్.. సైబర్​క్రైమ్​ కంటే ప్రమాదకరం'

By

Published : Nov 22, 2021, 11:35 AM IST

amazon
అమెజాన్

ఆన్​లైన్​లో డ్రగ్స్ విక్రయం సైబర్ క్రైమ్ కంటే ప్రమాదకరమైనదని మధ్యప్రదేశ్ హోంమంత్రి, భాజపా నాయకుడు నరోత్తమ్​ మిశ్రా అన్నారు. డ్రగ్స్​ సరఫరాపై దర్యాప్తునకు 'అమెజాన్ ఇండియా' సహకరించాలని కోరారు. ప్రభుత్వం కంటే అమెజాన్ పెద్దది కాదన్నారు.

ఆన్​లైన్​లో గంజాయి స్మగ్లింగ్ కేసుకు సంబంధించి.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్ ఇండియా'పై ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ హోంమంత్రి, భాజపా నాయకుడు నరోత్తమ్​ మిశ్రా. అమెజాన్ కంపెనీ దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేరాలను తమ రాష్ట్రంలో సహించబోమన్నారు.

"4 నెలల క్రితమే అమెజాన్ సంస్థకు హెచ్చరికలు జారీచేశాం. అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు విచారణకు కచ్చితంగా సహకరించాలి. అమెజాన్ సంస్థ పెద్దది కావచ్చు.. కానీ ప్రభుత్వం కంటే పెద్దది కాదు. దర్యాప్తునకు సహకరించాలి. ఆన్​లైన్​లో డ్రగ్స్ అమ్మటం సైబర్​క్రైమ్​ కంటే ప్రమాదకరమైనది. ఎలాంటి అడ్రస్​ లేని వ్యక్తులు/సంస్థల నుంచి అమెజాన్ వ్యాపారం చేస్తోంది. ఇలాంటి వాటిని మధ్యప్రదేశ్​లో అనుమతించం."

-- నరోత్తమ్​ మిశ్రా, మధ్యప్రదేశ్ హోంమంత్రి

ఇదీ కేసు..

అమెజాన్ వేదికగా గంజాయి అక్రమ రవాణా అవుతున్నట్లు ఈ నెల 15న మధ్యప్రదేశ్ భింద్​ జిల్లా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కరివేపాకు అని రాసి ఉన్న 20 కేజీల గంజాయి పార్సిల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 'కల్లు' అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా.. గంజాయి రాకెట్ గుట్టు రట్టయింది. కల్లు రూ.1.1కోట్ల లావాదేవీలు జరిపినట్లు తెలిసిందని భిండ్ ఎస్పీ వెల్లడించారు. స్థానిక గోవింద్ దాబాలో ఉన్న అతడిని.. దాబా నిర్వాహకుడిని అరెస్టు చేశారు. గంజాయి పార్సిళ్లను రిసీవ్ చేసుకునేది 'కల్లు'నే పోలీసులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్​లోనూ ముకేశ్ జైశ్వాల్​ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్​ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు అమెజాన్ ​ ద్వారా గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఇదీ చూడండి:ఆన్​లైన్​లో గంజాయి విక్రయం.. 'అమెజాన్​' అధికారులపై కేసు

ABOUT THE AUTHOR

...view details