బంగాల్ రాజధాని కోల్కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డెంగీ కేసులు పెరగడంపై ప్రభుత్వాన్ని తప్పుబడుతూ భాజపా కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అధికార తృణమూల్ కాంగ్రెస్.. డెంగీ కేసుల గణాంకాలను తారుమారు చేస్తోందని ఆరోపించారు. 'డెంగీ రహిత నగరం కావాలి' అనే నినాదాలతో కోల్కతా వీధుల్ని హోరెత్తించారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. చాందిని చౌక్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వెనుదిరగమని నిరసనకారులను హెచ్చరించారు. కానీ కొందరు పోలీసులపైకి మంచినీటి సీసాలు విసిరారు. అనంతరం పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జలఫిరంగులతో వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించారు. అనేక మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ర్యాలీకి భాజపా యువ మోర్చ అధ్యక్షత వహించింది. సెంట్రల్ అవెన్యూ నుంచి కోల్కతా పురపాలక సంఘం(కేఎమ్సీ) వరకు ఈ ర్యాలీ చేపట్టాలనుకుంది.