తెలంగాణ

telangana

హక్కులే సర్వస్వం.. సమన్యాయం కోసం అలుపెరగని పోరాటం

By

Published : Apr 14, 2022, 7:16 AM IST

DR Babasaheb Ambedkar: ఆయన ఓ సైనికుడి కుమారుడు. క్రమశిక్షణ, పట్టుదల, సహనం, సమానత్వమనే లక్షణాలను రక్తంలో రంగరించుకుని పుట్టారు. అందుకే అంటరాని కులమంటూ సమాజం వివక్ష చూపినా ధిక్కరించారు. చదువే ధ్యాసగా జీవించారు. సమగ్ర అధ్యయనం, విషయ సేకరణలో మేరునగధీరుడిగా నిలిచారు. ప్రజలంతా స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే వారికి మద్దతు ఇస్తూనే.. అది లభించాక మనం ఎలా ఉండాలో నిర్దేశించేందుకు ఒంటరి సైన్యమై నడిచారు. ఆయన మార్గదర్శకత్వంలో రూపొందిన రాజ్యాంగంతో అందరికీ ఓటు, అస్పృశ్యులకు హక్కులు దక్కాయి. ఆయనే.. మహామనీషి, సామాజిక శాస్త్రవేత్త డాక్టర్‌ బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌.

AZADI KA AMRIT MAHOTSAV
AZADI KA AMRIT MAHOTSAV

DR Babasaheb Ambedkar: మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబెవాడకు చెందిన రామ్‌జీ మాలోజీ సక్పాల్‌, భీమాబాయిలు అంబేడ్కర్‌ తల్లిదండ్రులు. బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో సుబేదార్‌గా పనిచేసిన రామ్‌జీ.. పదవీ విరమణ అనంతరం బ్రిటిష్‌ సైనిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. అందులో భాగంగానే మధ్యప్రదేశ్‌లోని మావ్‌ అనే గ్రామంలో రామ్‌జీ పని చేస్తున్నప్పుడు 1891 ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జన్మించారు. మహారాష్ట్రలోని సతారాలో ఆయన ప్రాథమిక విద్యాభాస్యం పూర్తయింది. తన ఐదో ఏటనే తల్లి మరణించడం వల్ల తీవ్ర కుంగుబాటుకు లోనైన అంబేడ్కర్‌ను గ్రామంలోనూ, పాఠశాలలోనూ నెలకొన్న అస్పృశ్యత వాతావరణం మరింత బాధించింది. అయినా చదువును ఏనాడూ అశ్రద్ధ చేయలేదు. కొడుకు భవిత కోసం తండ్రి తన మకాం బొంబాయికి మార్చారు. అక్కడ ఆరో తరగతిలో చేరిన అంబేడ్కర్‌... అక్షరాలే ఆలంబనగా అలుపెరుగని ప్రయాణం చేశారు. 1912లో బీఏ ఉత్తీర్ణత సాధించిన తొలిబహుజన యువకుడిగా చరిత్ర సృష్టించారు. అమెరికాలో 1917లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పొంది, ఆసియా నుంచి తొలిసారి ఈ ఘనత సాధించిన విద్యావేత్తగా ప్రసిద్ధికెక్కారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి ఆర్థికశాస్త్రంలో డీఎస్సీ, అక్కడి నుంచే ఎమ్మెస్సీ ఆర్థిక శాస్త్రంలో డబుల్‌ పీహెచ్‌డీ పొందారు. లండన్‌లోనే న్యాయవిద్యను అభ్యసించారు. మరాఠీ, హిందీ, పార్శీ, ఇంగ్లిషు, గుజరాతీ, పాళీ, సంస్కృతం, జర్మన్‌, ఫ్రెంచ్‌ భాషల్లో పూర్తి ప్రావీణ్యం సాధించారు.

డాక్టర్‌ బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌

అస్పృశ్యతపై అంతులేని పోరాటం..ఆంగ్లేయులను వెళ్లగొట్టడానికి జరిగిన మహా పోరాటంలోని ఘట్టాలను ఆయన నిశితంగా పరిశీలించారు. అయితే.. దేశంలో కులాల పేరిట పాతుకుపోయిన అస్పృశ్యతను రూపుమాపకపోతే స్వాతంత్య్రం సాధించినా బడుగు, బలహీనవర్గాలకు ఏమీ దక్కదని ప్రతిచోటా నినదించారు. 'సమన్యాయం... సామాజికన్యాయం' పునాదిగా అలుపెరగని పోరాటం సాగించారు. మహిళల సాధికారతకు బాటలు వేయకుండా వచ్చే స్వేచ్ఛతో సమాజం ప్రగతి సాధించలేదని కుండబద్దలు కొట్టారు. అందరికీ చదువు లేకుంటే స్వాతంత్య్ర ఫలాలు కొందరికే దక్కుతాయని ఆందోళన చెందారు. ఈ క్రమంలో డిప్రెస్డ్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ(1928), పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ(1945), సిద్ధార్థ్‌ కాలేజీ(1946), మిళింద్‌ కాలేజీ(1950) స్థాపించారు. వారికి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(1936), షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌(1942) స్థాపించారు. దేశం ఆర్థికంగా బలపడేందుకు 1935లో ఆర్‌బీఐ స్థాపనకు రోడ్‌మ్యాప్‌ ఇచ్చారు. వివిధ సందర్భాలలో బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలలో అంటరాని కులాల ప్రజలకు, మహిళలకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పించేలా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తన వాదనను నెగ్గించుకోవడానికి న్యాయవాదిగా, జర్నలిస్టుగా, ఉద్యమకారునిగా, గ్రంథ రచయితగా ఎన్నో బాధ్యతలను అవలీలగా నిర్వర్తించారు. బాబాసాహెబ్‌ ఆశయాల సాధనకు ఆయన మరణాంతరం రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(1957)ను ఆయన అనుయాయులు ప్రారంభించారు.

రాజ్యాంగ రచనలో మేటి..దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక రాజ్యాంగరచనా ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారు. వివిధ దేశాల రాజ్యాంగాలను సమగ్రంగా పరిశీలించి రెండేళ్ల 11 నెలల 18 రోజులపాటు తన కమిటీ సహచరులతో కలిసి శ్రమించి రూపొందించిన రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశాలకు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తోంది. నాటికి మన దేశంలో దాదాపు 35 కోట్ల జనాభా ఉండగా కేవలం 15% మందికే ఓటు హక్కు ఉండేది. శూద్రులు, మహిళలు, పేదవారికి ఓటేసే హక్కేలేదు. బాబాసాహెబ్‌ ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఓటుహక్కును ప్రతిపాదిస్తూ ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అప్పటికి అమెరికాలోనూ మహిళలకు ఓటు లేకపోవడం గమనార్హం. అనాదిగా వేదనకు, పీడనకు గురైన శూద్రులకు, అట్టడుగు వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన ప్రతిపాదనా సంచలనమే. ఎన్నికలు, పరిపాలన, ఆర్థిక, విద్య, రక్షణ, అంతర్గత భద్రత ఇలా అన్ని అంశాల్లోనూ.. ఆయన రూపొందించిన రాజ్యాంగం స్ఫూర్తితోనే దేశం ముందుకుసాగుతోంది.

ఇదీ చదవండి:'నడిస్తే నేరం.. పాకుతూ వెళ్లండి'.. పంజాబీలపై ఆంగ్లేయుల పైశాచికం

ABOUT THE AUTHOR

...view details