తెలంగాణ

telangana

సమాజ్​వాదీకి షాక్​.. భాజపాలో చేరిన ములాయం కోడలు

By

Published : Jan 19, 2022, 11:08 AM IST

Updated : Jan 19, 2022, 5:32 PM IST

సమాజ్​వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్.. భాజపాలో చేరారు. గతకొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

Aparna Yadav  joins BJP
Aparna Yadav joins BJP

Mulayam Daughter in law joins BJP: సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్.. భాజపాలో చేరారు. ఉత్తర్​ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్​.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

భాజపాలో చేరిన అపర్ణా యాదవ్
పార్టీ సభ్యత్వాన్ని ఇస్తున్న నేతలు

Aparna Yadav joins BJP

అపర్ణ భాజపాలో చేరుతారని ముందు నుంచీ ఊహాగానాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఇప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత మాట్లాడిన అపర్ణ.. భాజపాకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అన్నింటికన్నా దేశమే ముందు అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును తాను అమితంగా ఇష్టపడతానని వెల్లడించారు.

అపర్ణా యాదవ్

ప్రధాని మోదీ పనితీరు చూసి భాజపా పట్ల ఆకర్షితురాలినయ్యాను. దేశం ముందు అనేది నా ఆలోచనా విధానం కూడా. దేశం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నాకు అందరి సహకారం కావాలి. నా శక్తి మేరకు ఏం చేయాలో అది చేస్తాను.

-అపర్ణా యాదవ్

ఈ ఎన్నికల్లో అపర్ణను పోటీలోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయని భాజపా వర్గాలు తెలిపాయి. ఏ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారనే విషయం త్వరలో తేలనుంది.

UP Election 2022

ములాయం సింగ్ రెండో భార్యకు పుట్టిన ప్రతీక్ యాదవ్​ను అపర్ణ వివాహం చేసుకున్నారు. 2017 ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. ఇటీవలి కాలంలో భాజపా ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. రామమందిరం నిర్మాణానికి 11లక్షల విరాళం అందజేశారు. యోగీ సర్కార్‌ ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది.

అఖిలేశ్ స్పందన..

అపర్ణా యాదవ్​ భాజపాలో చేరటంపై అఖిలేశ్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు.

సమాజ్​వాదీ పార్టీ భావజాలం విస్తరణ జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. మా భావజాలం అక్కడికి చేరి రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆశిస్తున్నాను. ఆమెను ఒప్పించటానికి నేతాజీ (ములాయంసింగ్) చాలా ప్రయత్నం చేశారు. టికెట్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనేది క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజలు, పార్టీ అంతర్గత సర్వేలు నిర్ణయిస్తాయి.

- అఖిలేశ్​ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత

Aparna yadav BJP

గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణా యాదవ్ చేరిక.. భాజపాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా.. ఎస్​పీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి రావడం భాజపాకు లాభించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ సహా పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి ఇటీవల సమాజ్​వాదీ పార్టీలో చేరారు. బీసీ ఓట్లతో భాజపా అధికారంలోకి వచ్చిందని, ఇన్నేళ్లయినా ఆ వర్గాన్ని పట్టించుకోలేదని ఈ మేరకు ఆరోపించారు.

ఇదీ చదవండి:'మాస్కు తప్పనిసరేం కాదు.. మోదీనే చెప్పారు'

Last Updated : Jan 19, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details