ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Concern of auto drivers : 'ముఖ్యమంత్రి గారూ.. మాట నిలబెట్టుకోరా? స్వచ్ఛ ఆటో డ్రైవర్ల అవస్థలెన్నో..'

By

Published : May 8, 2023, 6:55 PM IST

Concern of auto drivers : "స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్" పథకం కింద ఇంటింటికీ వెళ్లి తడిచెత్త, పొడిచెత్త సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ఆటోలు నామమాత్రంగా నడుస్తున్నా.. వాహన డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఉన్న గుత్తేదారు ఏజెన్సీ ఆరు నెలలకోసారి వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. కార్మికులు, డ్రైవర్ల ఆందోళనతో కొత్త ఏజెన్సీ మారినా... పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడం లేదని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. తమకు కనీస వేతన చట్టం కూడా అమలు కావడం లేదని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

clap Auto Drivers

Concern of auto drivers : స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పథకంలో భాగంగా క్లాప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థకు ఎలక్ట్రికల్ ఆటోలను సమకూర్చింది. రెండున్నరేళ్ల కిందట రెడ్డి ఏజెన్సీ ఆటోలను సమకూర్చి.. వాటి డ్రైవర్లకు వేతనాలు అందించేది. ఈ లెక్కన రాష్ట్రంలో 6,500 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు దాదాపు 75 ఎలక్ట్రికల్ ఆటోలను ఏర్పాటు చేశారు. ఈ ఆటోలు ఇంటింటికీ వెళ్లి తడిచెత్త, పొడిచెత్త సేకరిస్తున్నాయి. ప్రతి ఇంటి నుంచి 90 రూపాయల వరకు ప్రతినెలా వసూలు చేస్తున్నారు. గతంలో ఉన్న ఏజెన్సీ ఐదారు నెలలకు వేతనాలు ఇస్తుంటే.. కార్మికులు, డ్రైవర్లు ఆందోళనలు చేయడంతో ఆ ఏజెన్సీని మార్చేశారు.

ప్రతి నెలా 10వ తేదీన వేతనాలు.. ప్రస్తుతం కొత్త ఏజెన్సీ బాధ్యతలు తీసుకుని ప్రతినెలా 10వ తేదీలోపు వేతనాలను అందిస్తున్నారు. కాగా, డ్రైవర్ కు 10 నుంచి 11 వేల రూపాయలు మాత్రమే వేతనం అందిస్తున్నారని.. కనీస వేతన చట్టం అమలు చేయడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. దీంతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు ఎక్కడ జమ చేస్తున్నారో తమకు తెలియడం లేదని నిట్టూరుస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేసే ప్రతి కార్మికుడు, డ్రైవర్ కు కనీస వేతనం 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు అమలు చేస్తామని చెప్పినా అమలు కావడం లేదని తెలిపారు.

కనీస వేతనాల ఊసేదీ.. కడప నగర పాలక సంస్థలో బాధ్యతలు చేపట్టిన కొత్త ఏజెన్సీ.. 8 గంటల పాటు నిరంతరాయంగా పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లతో పని చేయిస్తోందని చెప్తున్న కార్మికులు.. తమకు రావాల్సిన కనీస వేతనం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. క్లాప్ కార్యక్రమం అమలు చేసి రెండున్నరేళ్లు అవుతున్నా.. కార్మికుల పీఎఫ్ డబ్బులు ఎంత జమ చేస్తున్నారు.. వాటి ఖాతా వివరాలు ఏంటనేది ఇంతవరకు తమకు తెలియడం లేదని మథన పడుతున్నారు. అధికారులు, గుత్తేదార్లు కుమ్మక్కై కార్మికుల పొట్ట గొడుతున్నారని వాపోయారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇటీవల కడపలో ఓ కార్మికుడికి రోడ్డు ప్రమాదం జరిగితే.. ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లడానికి కూడా వీలులేని పరిస్థితి ఉందని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం కాదని.. వారి సమస్యలు పరిష్కరించాలని కార్మికసంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. మేడే సందర్భంగా గొప్పగా మాటలు చెప్పిన ముఖ్యమంత్రి.. మేడే జరుపుకునే అర్హత కూడా సీఎంకు లేదన్నారు. ఇప్పటికైనా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ పథకం కింద పనిచేసే డ్రైవర్లు, కార్మికులకు ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details