ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ప్రశ్నిస్తే పగబట్టారా ?.." కాక రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు

By

Published : Jan 30, 2023, 10:09 AM IST

Updated : Jan 30, 2023, 11:39 AM IST

Kotamreddy
Kotamreddy

MLA Kotamreddy Phone Tapping : ప్రశ్నిస్తే ఎవరినైనా సహించేది లేదని.. వైసీపీ ప్రభుత్వ పెద్దలు మరోసారి తమ చర్యల ద్వారా స్పష్టం చేశారు. తాజాగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌తోపాటు.. ఆయనపై ఇంటెలిజెన్స్‌ నిఘా ఉంచడం దీనికి నిదర్శనంగా నిలిచింది.

MLA Kotamreddy Phone Tapping : ప్రశ్నిస్తే ఎవరినైనా సహించేది లేదని వైసీపీ ప్రభుత్వ పెద్దలు మరోసారి తమ చర్యల ద్వారా స్పష్టం చేశారు. వారి శైలి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే పగబడతామన్నట్టుగా ఉందా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌తో పాటు ఆయనపై ఇంటెలిజెన్స్‌ నిఘా ఉంచడం దీనికి నిదర్శనమన్నట్టు స్పష్టమైంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవలే నియమించారు.

ఇప్పుడు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంతు వచ్చినట్లుంది! తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని ఎమ్మెల్యే స్వయంగా బయటపెట్టారు. ‘ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం నుంచి అనుమతి లేకుండానే అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ను పోలీసు అధికారులు ట్యాప్‌ చేయరు’ అని ఎమ్మెల్యే వర్గీయులు మండిపడ్డారు. ‘మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అధికారులు నిధులివ్వడం లేదు. రూ.10 విలువ పని చేస్తే అర్ధ రూపాయీ విడుదల కావడం లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన బారాషహీద్‌ దర్గా ప్రాంతంలో మసీదు నిర్మాణానికీ డబ్బులివ్వలేదు. ఇలాగైతే ప్రజలకేం సమాధానం చెప్పాలి?’ అంటూ ఇటీవల అధికారిక సమావేశంలోనే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

‘3 నెలల నుంచి నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు. ట్యాపింగ్‌ మొదలు పెట్టిన 1, 2 రోజుల్లోనే నాకు సమాచారం వచ్చింది’ అని శనివారం తనవద్దకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పేర్కొనడం ఆదివారం బయటకు వచ్చింది. ‘ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ను అధికారంలో ఉన్నవారు వాడతారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడమేంటి?’ అని ఆయన వారితో అన్నట్లు సమాచారం. తన డ్రైవరుతో మరో ఫోన్‌ తెప్పించి దానిని ఆ ఇంటెలిజెన్స్‌ సిబ్బందికి చూపిస్తూ.. ‘మీరు (పోలీసులు) ట్యాప్‌ చేస్తున్నారనే ఇలా మరో ఫోన్‌ వాడుతున్నా. ఒకటి కాదు 12 రకాల సిమ్‌లు ఉపయోగిస్తున్నా. ఫేస్‌టైం, టెలిగ్రామ్‌ కాల్స్‌ అయితే ఏ సాఫ్ట్‌వేర్‌ ట్యాప్‌ చేయలేదు. అవసరమైతే నా ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ప్రత్యేకంగా ఐపీఎస్‌ అధికారిని నియమించాలని మీ అధికారులకు చెప్పండి’ అని ఆయన వారితో సరదాగా అన్నట్లు సమాచారం.

ఇదా నాకిచ్చిన గుర్తింపు?:ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ‘రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఇప్పుడు జగన్‌ వరకూ మూడు తరాలకు సేవ చేస్తున్నా. గతంలో జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎదుర్కొని మరీ జగన్‌ ఓదార్పు యాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేయించగలిగా. పార్టీ అధికారంలోకొచ్చాక మంత్రి పదవి, స్పీకర్‌, ఉపసభాపతి, చీఫ్‌విప్‌, విప్‌, చివరికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికీ అర్హుడిని కాకుండా పోయానా?’ అని ఎమ్మెల్యే తన సన్నిహితులవద్ద వాపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 30, 2023, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details