ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతులకు ఇచ్చే మద్దతు ధర పైసా కూడా తగ్గొద్దు: సీఎం జగన్​

By

Published : Dec 5, 2022, 4:26 PM IST

JAGAN REVIEW ON PADDY PROCUREMENT : రైతులకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలో పైసా కూడా తగ్గకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్‌ నుంచి చెల్లించాలని,.. ఈ విధానాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలన్నారు. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విషయం రైతులకు తెలపాలన్నారు. అవకతవకలు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఎస్‌ఓపీలు ఉండాలన్న సీఎం.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగు మీద రైతులకు అవగాహన కల్పించాలని, అలాంటి రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

CM REVIEW ON PADDY PROCUREMENT
CM REVIEW ON PADDY PROCUREMENT

CM REVIEW ON KHARIF PADDY PROCUREMENT : ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా సేకరిస్తున్న కొత్త విధానం అమలు తీరును సమగ్రంగా సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు పలు ఆదేశాలు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. దీనికోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశామన్నారు. ఈ కొత్తవిధానం ఎలా అమలవుతున్నదీ గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

అత్యంత పారదర్శకంగా చెల్లింపులు ఉండాలి: ధాన్యం సేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు ముందుగానే గోనె సంచులు అందుబాటులోకి తీసుకురావాలని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా, లేబర్‌ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలన్న సీఎం.. అత్యంత పారదర్శకంగా ఈ చెల్లింపులు ఉండాలన్నారు. ఈ విధానాన్ని ఒకసారి పరిశీలించి.. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలన్నారు. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలియజెప్పాలన్నారు.

ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్‌ నుంచి వారికి డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల చెల్లింపుల్లో అత్యంత పారదర్శకత తీసుకువచ్చినట్టు అవుతుందన్నారు. ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన యాప్‌లో.. సిగ్నల్స్‌ సమస్యల వల్ల అక్కడక్కడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న సీఎం... ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని, సిగ్నల్‌ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్‌ అయ్యేలా మార్పులు చేసుకోవాలన్నారు.

ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలి: అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నామని, ఆ శాఖల నుంచి తగిన సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సమాచారాన్ని సమగ్రంగా తెలియజేసేలా ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలని, దీనివల్ల రైతుల్లో అవగాహన కలుగుతుందన్నారు. రైతుల ఫోన్లకూ ఈ సమాచారాన్ని ఆడియో, వీడియో రూపంలో పంపించాలన్నారు. ధాన్యం సేకరణ కోసం అనుసరిస్తున్న సరికొత్త విధానం, ఈ ప్రక్రియలో ఏమేం చేస్తున్నామన్న దానిపై సంపూర్ణంగా సమాచారం వారికి చేరవేయాలని సూచించారు.

పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ల విధులపై ఎస్‌ఓపీలను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఎస్‌ఓపీలను పాటించేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. అవకతవకలు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఎస్‌ఓపీలు ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగు మీద రైతులకు అవగాహన కలిగించాలని, అలాంటి రైతులను ప్రోత్సహించాలని నిర్దేశించారు. ప్రభుత్వం మిల్లెట్స్‌ సాగును ప్రోత్సహిస్తోందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details