ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CHANDRABABU CONDEMNS: మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై దాడి అమానుషం: చంద్రబాబు

By

Published : Sep 21, 2021, 3:26 PM IST

గుంటూరు జిల్లా కొప్పర్రులో తెదేపా మహిళా నాయకురాలి ఇంటిపై దాడి అమానుషమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా నేతల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శారద కుటుంబ సభ్యుల్ని ఆయన ఫోన్​లో పరామర్శించి.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని..,ధైర్యంగా ఉండాలని సూచించారు.

మాజీ జెడ్పీటీసీ శారద ఇంటిపై దాడి అమానుషం
మాజీ జెడ్పీటీసీ శారద ఇంటిపై దాడి అమానుషం

గుంటూరు జిల్లా కొప్పర్రులో మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై దాడిని తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఖండించారు. శారద ఇంటిపై దాడి అమానుషమన్న చంద్రబాబు(Chandrababu condemns over tdp leader Sarada hous attack)..వైకాపా నేతల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. శారద కుటుంబ సభ్యుల్ని ఆయన ఫోన్​లో పరామర్శించి.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఏం జరిగిందంటే..

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా సభ్యులు ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఊరేగింపు తెదేపా నేతల ఇళ్ల సమీపంలోకి రాగానే గొడవ మొదలైంది. ఇళ్లముందు కూర్చుని ఉన్న తెదేపా వర్గీయులపై రాళ్ల దాడి జరిగింది. వారు కూడా ధీటుగా స్పందించడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆ సమయంలో పెదనందిపాడు ఎస్సై నాగేంద్రతోపాటు ఐదారుగురు పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో గొడవను నియంత్రించడం సాధ్యం కాలేదు.

తెదేపా వర్గీయులతోపాటు ఎస్సైకూడా ప్రాణరక్షణకోసం తెదేపా మాజీ జడ్పీటీసీ శారద ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత 100మంది వరకు వైకాపా వర్గీయులు మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై దాడికి దిగారు. రాళ్లతో కిటికీలు, తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కిటికీలు పగిలి పోవడంతో రాళ్లు లోపలికి వెళ్లి అక్కడ ఉన్నవారికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆ ఇంటిముందున్న ఆరు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టారు. డీజిల్‌, కిరోసిన్‌ పోసి ఇంట్లో ఉన్నవారిని కూడా బయటకు రాకుండాచేయాలని ప్రయత్నించారు. లోపల ఉన్నవారంతా గంటకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కరెంట్‌ మీటర్‌ వద్ద ఫీజులు తీసివేయడంతో చీకట్లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు లోనయ్యారు. పోలీసులు ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు కొప్పర్రులో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అండగా ఉంటాం..

మూడు రోజుల క్రితం వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్​ను కూడా చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

సంబంధిత కథనాలు

ABOUT THE AUTHOR

...view details