ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం

author img

By

Published : Sep 21, 2021, 2:48 AM IST

Updated : Sep 21, 2021, 10:54 AM IST

మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం అర్ధరాత్రి తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తెదేపా మాజీ జడ్పీటీసీ బత్తిని శారద ఇంటి వద్దకు వచ్చిన వైకాపా కార్యకర్తలు ఆమె ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి దూరి సామగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి, 6 ద్విచక్ర వాహనాలకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా సభ్యులు ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఊరేగింపు తెదేపా నేతల ఇళ్ల సమీపంలోకి రాగానే గొడవ మొదలైంది. ఇళ్లముందు కూర్చుని ఉన్న తెదేపా వర్గీయులపై రాళ్ల దాడి జరిగింది. వారు కూడా ధీటుగా స్పందించడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆ సమయంలో పెదనందిపాడు ఎస్సై నాగేంద్రతోపాటు ఐదారుగురు పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో గొడవను నియంత్రించడం సాధ్యం కాలేదు.

తెదేపా వర్గీయులతోపాటు ఎస్సైకూడా ప్రాణరక్షణకోసం తెదేపా మాజీ జడ్పీటీసీ శారద ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత 100మంది వరకు వైకాపా వర్గీయులు మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై దాడికి దిగారు. రాళ్లతో కిటికీలు, తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కిటికీలు పగిలి పోవడంతో రాళ్లు లోపలికి వెళ్లి అక్కడ ఉన్నవారికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆ ఇంటిముందున్న ఆరు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టారు. డీజిల్‌, కిరోసిన్‌ పోసి ఇంట్లో ఉన్నవారిని కూడా బయటకు రాకుండాచేయాలని ప్రయత్నించారు. లోపల ఉన్నవారంతా గంటకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కరెంట్‌ మీటర్‌ వద్ద ఫీజులు తీసివేయడంతో చీకట్లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి.

ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు లోనయ్యారు. పోలీసులు ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పొన్నూరు సీఐ శ్రీనివాస్, ఎస్సైలు నాగేంద్ర, రవీంద్రలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు కొప్పర్రులో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి

'కొప్పర్రులో నిమజ్జనం సందర్భంగా గొడవ జరిగింది. ఒక పార్టీ జెండాలు ఊపారని ఇరువర్గాల మధ్య ఘర్షణ.ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని రాళ్లు రువ్వుకున్నారు. ఘర్షణలో పది మందికి గాయాలయ్యాయి. 3 ద్విచక్రవాహనాలు దహనమయ్యాయి. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశాం. ఇప్పటికే 15 మందిని అదుపులోకి తీసుకున్నాం.'- పొన్నూరు గ్రామీణ సి.ఐ. అళహరి శ్రీనివాస్‌

పక్కా ప్రణాళిక ప్రకారమే..

పక్కా ప్రణాళిక ప్రకారమే.. తమ ఇంటిపై వైకాపా నేతలు దాడి చేశారని.. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జనోత్సవాల సమయంలో 4 సంవత్సరాలుగా వైకాపా వర్గీయులు.. తమపై దాడికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్న పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారని అసహనం వ్యక్తం చేశారు. తన భర్త పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజల్లో తమకున్న ఆదరణను చూసి ఓర్వలేకే దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

24 గంటల్లో చర్యలు తీసుకోవాలి..

వైకాపా నేతలు చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వినాయక ఊరేగింపులో ఇలాంటి అరాచకం ఏంటని ప్రశ్నించారు. ఘటన స్థలంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటం పోలీసు వ్యవస్ధ పనితీరుకు అద్ధం పడుతోందన్నారు. తెదేపా కార్యకర్తల ఇళ్ల మీదకు వచ్చి వైకాపా రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. బత్తిన శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు.

'రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ప్రేక్షకపాత్ర వహిస్తోంది. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరమన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా దాడులు పెరిగిపోయాయి. దాడులకు సహకరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అధికారంతో దుశ్చర్యలకు పాల్పడితే అనుభవించక తప్పదన్నారు. కొప్పర్రులో శారద ఇంటిపై దాడిచేసి ఇల్లు, బైక్‌లు తగలబెట్టారు. ఘటనాస్థలిలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. తెదేపా కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారు. బత్తిన శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. 24 గంటల్లోగా చర్యలు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం.'- అచ్చెన్నాయుడు

ఇదీచదవండి.

Suicide in Lodge: లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి

Last Updated :Sep 21, 2021, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.