ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దుర్గ గుడిలో వైసీపీ నేత తిష్ఠ - అదునుచూసి ఆస్తులన్నీ స్వాహా - YSRCP Leaders Irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 9:04 AM IST

Vijayawada YCP Leader Focus on Durga Temple and Lands : గుడిని గుడిలోని లింగాన్ని మింగేస్తాడు అనే మాట మనం తరచూ వింటుంటాం. కానీ రాష్ట్రంలో ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి పేరు చేబితే ఇది నిజమే అనిపిస్తుంది. రోజుకు రెండుసార్లు దైవదర్శనం చేసుకునే ఆయన చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీదా అన్నట్టుగా చూపంతా దేవతామూర్తుల ఆభరణాల మీదా, అక్కడుండే ఆదాయ వనరుల మీదా సారిస్తారు. ఒకసారి గురి కుదిరాక అక్కడి ఆస్తులన్నింటినీ స్వాహా చేస్తారు.

YSRCP_Leaders_Irregularities_in_AP
YSRCP_Leaders_Irregularities_in_AP

దుర్గ గుడిలో వైసీపీ నేత తిష్ఠ - అదునుచూసి ఆస్తులన్నీ స్వాహా

Vijayawada YCP Leader Focus on Durga Temple and Lands : ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆ శాసనసభ్యుడు తాను పరమ దైవభక్తుడినని చెప్పుకొంటారు. ఆ శాఖకు మంత్రి పదవి వెలగబెట్టారు. ఆదాయం పరంగా రాష్ట్రంలో తిరుమల తర్వాత దుర్గ గుడిది రెండో స్థానం. మంత్రి కాగానే దుర్గ గుడిపై తిష్ఠ వేశారీ ప్రజాప్రతినిధి. అమ్మవారిని రోజుకు రెండుసార్లు దర్శించుకుంటారు. కారణం భక్తి కాదు భుక్తి. పచారీ సామగ్రి టెండర్ల నుంచి కేశాల విక్రయాల టెండర్ల వరకు తన అనుచరులకే కట్టబెట్టారు.

అమ్మవారి చీరల మాయం దగ్గర నుంచి హుండీలో కానుకల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి రథం వెండి సింహాల మాయం వెనుక ఆయన అనుచరులే ఉన్నారనేది పోలీసులకూ తెలిసిన సత్యం. ఆలయానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి గ్రాంటు తేలేని ఆయన హుండీ, కౌలు రూపంలో వచ్చే ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కట్టడం, కూల్చడం వంటి పనులతో కమీషన్లు దండుకున్నారు. సింగ్‌నగర్‌ సమీపంలో దుర్గగుడికి చెందిన దాదాపు 4వేల గజాల స్థలం ఇప్పుడు రికార్డుల్లో లేదు. దీన్ని మాయం చేసి తమ పేరున రిజిస్టరు చేయించుకున్నట్లు చెబుతున్నారు.

మంత్రి పదవి ఊడినా తన నియోజకవర్గంలోనే గుడి ఉందనీ అమాత్యుడిని సైతం బెదిరింపులకు గురిచేసి నిధులు పక్కదారి పట్టించారు. విజయవాడకు సమీపంలోని ఓ ఆలయానికి చెందిన 5.16 ఎకరాలపై ఆయన కన్నుపడింది. ఓ సత్రం పేరుతో దరఖాస్తు చేయించి వారికి భూములు దక్కేలా చక్రం తిప్పారు. ఇక్కడ ఎకరం 10 కోట్ల రూపాయల వరకు ఉండగా 2ఎకరాలను మంత్రి బినామీకి రాయించారు. ఓఎస్​డీ మామ పేరుతో పవర్‌ ఆఫ్‌ అటార్నీ తీసుకున్నారు. ఇది రాష్ట్రంలోనే సంచలనమైంది.

విజయవాడలోని శ్రీవేణుగోపాలస్వామి దేవాలయానికి పెద్దఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఈయన సూచనతో ఈ ఆలయం తమ సొంతమంటూ కొందరు బయలు దేరారు. వారి దస్త్రాన్ని చకచకా నడిపిన ఆయన అది ప్రైవేటు దేవాలయమని ఎన్​ఓసీ జారీ చేశారు. ఈ ఆలయానికి నెలకు లక్షల రూపాయల ఆదాయం వచ్చే 21 వాణిజ్య దుకాణాలు, పలుచోట్ల భూములు ఉన్నాయి. కవులూరులోనే కోట్ల విలువ చేసే రెండెకరాల భూమి ఉంది. దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాటాలు దండుకున్నారు.

18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన జనసేన - Janasena Candidates for 18 Seats

ఈ ఎమ్మెల్యే కుటుంబానికి స్వతహాగా ఒక దేవాలయం ఉందట ! దాని చుట్టూ పురావస్తుశాఖ స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకేముంది పక్కాప్రణాళికతో దుకాణాల సముదాయం నిర్మాణానికి కోటి 30లక్షల రూపాయల సీజీఎఫ్​ నిధులు మంజూరు చేయించుకున్నారు. ఈ నిధులతో ఆర్కియాలజీ భూములు ఆక్రమించే ప్రయత్నం జరుగుతోంది. విజయవాడ కరకట్ట ప్రాంతంలో శ్రీవేంకటేశ్వర ఆలయానికి చెందిన భూములు ఉన్నాయి.

లీజు పేరుతో రెండుసార్లు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తే సొంత పార్టీ నాయకుడే అడ్డుపడ్డారు. పెనుగంచిప్రోలు దేవాలయ మాన్యాలను ధారాదత్తం చేశారు. విజయవాడలో వక్ఫ్‌బోర్డ్‌ భూములు ఎక్కువ శాతం ఈ ప్రజాప్రతినిధి బినామీలే ఆక్రమించుకున్నారు. ఈయన నియోజకవర్గ పరిధిలో ఓ దర్గాకు చెందిన స్థలంలో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అభ్యంతరాలను లెక్క చేయకుండా భారీ గోదాము నిర్మించారు.

ప్రధాన దేవాలయాల ఈవోల బదిలీల్లో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ కేసులున్న అధికారులను తన హయాంలో అందలం ఎక్కించారు. దుర్గ గుడి ఈవోగా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పట్టం కట్టారు. ఒక ఈవోకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కట్టబెట్టి 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. మేయరు పదవి తన అనుచరురాలికి ఇప్పించి నగరపాలక సంస్థని తన పరిధిలోకి తెచ్చుకున్నారు. కాంపెన్సటరీ ఉద్యోగాల దగ్గర నుంచి పారిశుద్ధ్య ఉద్యోగాల వరకు ధరలు నిర్ణయించి అమ్ముకున్నారు.

వైసీపీకి షాక్​ ఇస్తున్న నేతలు, కార్యకర్తలు - ఎన్డీఏలోకి భారీగా కొనసాగుతున్న వలసలు - Joining TDP and Janasena from YCP

ప్రణాళిక అధికారుల బదిలీలో కోట్ల రూపాయలు కొట్టేశారు. భవన నిర్మాణాలకు అనుమతులు లేకుండా దందా నడిపారు. ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం హోల్‌సేల్‌ ఫార్మాకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచే రాష్ట్రానికి మందులు పంపిణీ అవుతుంటాయి. ఇక్కడ సిండికేట్‌గా మార్చి అసలు మందుల స్థానంలో తన పలుకుబడి ఉపయోగించి ప్రాపగాండా కమ్‌ డిస్ట్రిబ్యూషన్‌ తరహాలో వ్యాపారం నిర్వహించారు. కరోనా సమయంలో తాము సరఫరా చేసిన మందులనే కొనేలా చక్రం తిప్పి ఆయన వాటాగానే 50 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు ప్రచారం ఉంది.

నియోజకవర్గంలో ముఠాలను పెంచి పోషిస్తూ సామాజిక స్థలాలు, పార్కులు ఆక్రమించేందుకు సహకరించారు. తన నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లు ఉన్నాయి. కొన్ని హోటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా కొన్ని అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. వీటి నుంచి ప్రజా ప్రతినిధికి నెలవారీ మామూళ్లు అందుతున్నాయి. తన సామాజికవర్గ వన సమారాధన పేరుతో ప్రతి ఏటా కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటారని ఆ వర్గీయులే చెబుతున్నారు.

ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం వాణిజ్య వ్యాపార కూడలి. ఇక్కడ జీరో దందా జరుగుతుంది. జీఎస్టీ ఎగవేతలు ఎక్కువే. రెండో రకం మాల్‌ విక్రయం జరుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ఏటా వ్యాపారుల నుంచి విరాళాల రూపంలో కప్పం వసూలు చేస్తున్నారు. తన నియోజకవర్గంలో నగర పేదలకు వేసిన రెండు లే అవుట్ల కోసం భూముల కొనుగోళ్లలో ఎకరానికి 10లక్షల రూపాయలు కమీషన్లు మింగేశారు. ఇలా కోట్లకు పడగలెత్తిన ఆ నేత వ్యవహారం అధినేత దృష్టికి వెళ్లింది. ఇంటికి పిలిపించి చాలావరకూ ఆస్తులు తన పరం చేయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆ ఫలితమే ప్రస్తుతం పక్క నియోజకవర్గం సీటు అని చెప్పుకొంటున్నారు.

లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - అనూహ్యంగా ముగ్గురికి సీటు

ABOUT THE AUTHOR

...view details