TDP Janasena Election Campaign : తెలుగుదేశం - జనసేన కూటమి కలిసికట్టుగా తొలిసారి ప్రచార సమరశంఖం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సగానికిపైగా అభ్యర్థులను ప్రకటించి అధికారపార్టీకి సవాల్ విసిరిన కూటమి ఇప్పుడు ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణ ద్వారా శ్రేణులు కలిసి కదన రంగంలోకి దూకేలా దిశానిర్దేశం చేయనున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోబోయే ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఇరు పార్టీల శ్రేణులు తరలిరానున్నారు.
పనితీరు బాలేకపోతే మార్చడం పక్కా - అభ్యర్థులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Election Campaign In Andra Pradesh :తెలుగుదేశం - జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. నేడు తాడేపల్లిగూడెం వేదికగా తొలి బహిరంగ సభ నిర్వహించనున్నాయి. బహిరంగ వేదికపై తొలిసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొననున్నారు. రెండు పార్టీల క్యాడర్ను రాజధాని స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కదనరంగంలోకి దూకేలా సంసిద్ధం చేసే ప్రధాన లక్ష్యమే ఎజెండాగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ తొలి ఉమ్మడి సభకు ‘జెండా’ అనే పేరును ఖరారు చేశారు. ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన నారా లోకేశ్ యువగళం - నవశకం ముగింపు సభలో చంద్రబాబు, పవన్కల్యాణ్ కలిసి పాల్గొన్నప్పటికీ, అభ్యర్ధులను ప్రకటించాక ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభే.
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్సార్సీపీ విముక్త రాష్ట్రంగా మార్చాలని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులను తొలగించాలని, బావితరాల శ్రేయస్సును ముందుకు తీసుకెళ్లాలని పొత్తు పెట్టుకున్నట్లు ప్రతి ఒక్కరికి తెలుసు." -అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
వైఎస్సార్సీపీ అరాచక పాలన గురించి ప్రజలకు చెప్పడమే గాక తెలుగుదేశం - జనసేన గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించనున్నారు. కార్యకర్తలు ఉమ్మడిగా కదనరంగంలో ఎలా పోరాడాలో అధినేతలు వివరిస్తారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. ఓటు బదిలీ అంశం అధినేతల ప్రసంగాల్లో కీలకాంశం కానుంది. ఈ పొత్తు రాబోయే రోజుల్లోను రెండు పార్టీల క్యాడర్కు ప్రయోజనం కలిగిస్తుందని, జనసేన కార్యకర్తలకు అన్నింటిలోను అవకాశాలు లభించబోతున్నాయనీ స్పష్టం చేయనున్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలకు మించిన సంక్షేమం ప్రజలకు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిల్లోనూ పరుగు పెట్టిస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు.