తెలంగాణ

telangana

పీజీ కాలేజ్‌ ఉమెన్స్​ హాస్టల్ స్నానాలగదిలో ఆగంతకులు - రక్షణ కోసం విద్యార్థినుల ధర్నా

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 3:42 PM IST

Osmania University Girls Hostel Incident : అర్ధరాత్రి వేళ ప్రభుత్వ మహిళా వసతి గృహంలోకి ఆగంతకులు చొరబడ్డారు. రాష్ట్ర రాజధానిలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన విద్యార్థినులు ఒకరిని బంధించగా మరో ఇద్దరు తప్పించుకున్నారు. ఈ ఘటనతో తీవ్రభయాందోళనకు గురైన విద్యార్థినులు హాస్టల్‌ ముందు బైఠాయించారు. రక్షణ విషయంలో అధికారుల నిర్లక్ష్యధోరణికి ఇదే నిదర్శనమంటూ ఆందోళనకు దిగారు.

Man Breaks Into Womens Hostel at OU
Osmania University Girls Hostel Incident

Osmania University Girls Hostel Incident: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా పీజీ కాలేజ్‌ సబ్‌క్యాంపస్‌ వసతి గృహం ఉలిక్కిపాటుకు గురైంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థినులు నిద్రిస్తున్న వేళ ముగ్గురు ఆగంతుకులు కత్తితో హాస్టల్‌లోకి చొరబడ్డారు. వసతి గృహం వెనక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న స్నానాల గదిలోకి వెళ్లారు. అదే సమయంలో అందులోకి వెళ్లిన ఓ యువతి గమనించి కేకలు(OU Girls Hostel Incident) వేసింది. అరుపులు విన్న హాస్టల్‌లోని విద్యార్థినులంతా నిద్రమేల్కొని అక్కడికి పరుగులు తీశారు. విద్యార్థినులంతా కలిసి సెక్యూరిటీ గార్డుల సాయంతో చున్నీతో ఓ వ్యక్తిని బంధించారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే విద్యార్థి సంఘాలకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్‌ వద్దకు చేరుకున్న పోలీసులు పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఓయూలో విద్యార్థుల ధర్నా- వీసీ రవీందర్ రాజీనామాకు డిమాండ్

Man Breaks Into Womens Hostel at OU : అర్ధరాత్రి వేళ ఆగంతకుల చొరబాటుతో హాస్టల్‌ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వసతి గృహానికి రక్షణ లేకపోవటం, అధికారుల నిర్లక్ష్యధోరణితోనే ఈ తరహా ఘటనలకు కారణమంటూ అర్ధరాత్రి హాస్టల్‌ ముందు విద్యార్థులు బైఠాయించారు. ఆందోళన చేస్తున్న వారికి విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. వీసీ వెంటనే హాస్టల్‌ వద్దకు వచ్చి, రక్షణ చర్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.

"రాత్రి 12 గంటలకు ఎవరో తెలియని వ్యక్తి హాస్టల్​కి వచ్చాడు. వసతి గృహం పక్కన ఏర్పాటు చేస్తున్న దోభిఘాట్​ను నిర్మిస్తున్న వ్యక్తుల దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఎలా రావచ్చు, దొరికిపోతే ఎలా పారిపోవాలో మొత్తం మ్యాప్​ వాళ్ల దగ్గర ఉంది. మేము చూసి సెక్యూరిటీకి చెబితే వాళ్లు వచ్చారు. సెక్యూరిటీ సాయంతో వాళ్లను పట్టుకున్నాం. మరో ఇద్దరు పారిపోయారు. మాకు ఎంత భయం ఉంటే అర్ధరాత్రి నుంచి హాస్టల్​ బయట కూర్చుంటాం. ఎలాంటి సౌకర్యాలు లేని ఇలాంటి హాస్టల్​లో ఎందుకు మమ్మల్ని పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం."- విద్యార్థిని

Farewell to OU CI Ramesh : ఓయూ సీఐకి విద్యార్థుల ఘన వీడ్కోలు.. పలువురి భావోద్వేగం

PG Girls Students Protest at Osmania University: ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని ఉత్తర మండల డీసీపీ రోహిణి ప్రియదర్శిని పరిశీలించి, ఆగంతకుల చొరబాటు గురించి తెలుసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో ఆమె మాట్లాడారు. ఇకపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీసీపీ రోహిణి ప్రియదర్శిని(DCP Rohini Priyadarshini) భరోసాతో ఉదయం 11 గంటల తర్వాత విద్యార్థినులు ఆందోళన విరమించారు. వసతి గృహంలో సౌకర్యాలపై అధికారులతో చర్చించినట్టు డీసీపీ తెలిపారు.

ఓయూలో అర్ధరాత్రి ఆగంతుకుల ఘటన- రక్షణ కల్పిస్తామన్న డీసీపీ

ఓయూలో 'నిరుద్యోగ మార్చ్'.. విద్యార్థి నాయకులు, కాంగ్రెస్​ నేతల అరెస్ట్

OU Security Failure Complaints in Hyderabad: మహిళా వసతిగృహంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు ఇంకా ఎవరెవరున్నారు ఎలా వచ్చారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనకు కారణమైన వీసీ, రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహాల్లో భద్రతా వైఫల్యాలపై అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోనందునే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వాపోయారు.

MLC Kavitha React on OU Incident : ఓయూ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థినుల భద్రత గాల్లో దీపంగా మారిందని చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనమని తన ఎక్స్​ ఖాతాలో ట్వీట్ చేశారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని వారి ధైర్యసాహసాలను అభినందిస్తున్నానని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

విద్యార్థినుల బాత్​రూంలోకి చొరబడిన దుండగులు - రక్షణ కల్పించాలంటూ అమ్మాయిల ధర్నా

ABOUT THE AUTHOR

...view details