IPL Controversies :ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ నుంచి అనేక వివాదాలకు వేదికైంది. డ్రగ్స్, ఆటగాళ్ల సస్పెన్షన్, గొడవలు, వాగ్వాదాలు ఇలా చాలానే చోటు చేసుకున్నాయి. కొందరు అరెస్టు అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివాదాలు ఏంటో చూద్దాం.
2008: ది స్లాప్గేట్ సాగా
మొదటి సీజన్లో పంజాబ్ తరఫున శ్రీశాంత్, ముంబయి తరఫున హర్భజన్ సింగ్ ఆడారు. ఐపీఎల్ మ్యాచ్ తర్వాత శ్రీశాంత్ను హర్బజన్ చెంప దెబ్బ కొట్టడం పెద్ద దుమారం రేపింది. శ్రీశాంత్ మాటలు అభ్యంతరకంగా ఉండటం వల్ల హర్బజన్ చేయి చేసుకున్నట్లు తెలిసింది.
2009 : పాకిస్థాన్ ఆటగాళ్లపై నిషేధం
ముంబయి ఉగ్రదాడుల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ వంటి పాక్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి నిషేధానికి గురయ్యారు.
2010: లలిత్ మోదీ సస్పెన్షన్
ఆర్థిక అవకతవకలపై లలిత్ మోదీ ఐపీఎల్ నుంచి సస్పెన్షన్ను ఎదుర్కొన్నారు. చివరికి అతనిని క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తొలగించారు. ఇక అదే ఏడాది రాజస్థాన్ టీమ్లో ఉన్న జడేజా, ఇతర ఐపీఎల్ జట్లతో ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా రూల్స్ను ఉల్లంఘించాడు. దీంతో ఒక సంవత్సరం నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.
2011 : ఛీర్ లీడర్ వ్యాఖ్యలు
ఐపీఎల్ నాలుగో సీజన్లో, ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి సంబంధించిన సౌతాఫ్రికా ఛీర్లీడర్ గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో, మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలలో క్రికెటర్ల ప్రవర్తన గురించి ఓ బ్లాగ్ చేయడం సంచలనం సృష్టించింది. చివరికి ఆమె ఛీర్లీడర్గా అవకాశం కోల్పోయింది. అదే ఏడాది కొచ్చి టస్కర్స్ కేరళ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం వల్ల ఆ ఫ్రాంచైజీ కాంట్రాక్ట్ రద్దు అయింది.
2012 : స్పాట్ ఫిక్సింగ్
ఆ ఏడాది ఐపీఎల్ సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో ఆరోపణలు ఎదుర్కొంది. టోర్నమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒక వార్తా ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత, స్పాట్ ఫిక్సింగ్ కార్యకలాపాల్లో కొందరు ఆటగాళ్లు చిక్కుకున్నారు. మీడియం-పేసర్ టీ.పీ.సుధీంద్ర జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఫాస్ట్ మీడియం బౌలర్ శలభ్ శ్రీవాస్తవ ఐదేళ్ల నిషేధానికి గురయ్యాడు. ఆల్ రౌండర్ అమిత్ యాదవ్తో పాటు బ్యాట్స్మెన్ మోహ్నీష్ మిశ్రా, అభినవ్ బాలిపై ఒక సంవత్సరం నిషేధం విధించారు. దీంతో పాటు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భద్రతా అధికారులతో షారుక్ ఖాన్ వాగ్వాదం కారణంగా ఆయన్ను స్టేడియంలోకి ప్రవేశించకుండా ఐదేళ్ల నిషేధం విధించారు.
2012 : డెక్కన్ ఛార్జర్స్ రద్దు
డెక్కన్ ఛార్జర్స్ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో ఆ జట్టు కాంట్రాక్ట్ను రద్దు చేశారు. ఇక ఐపీఎల్ సీజన్లో మాదక ద్రవ్యాల వినియోగంపై పుణె వారియర్స్ ఆటగాళ్లు రాహుల్ శర్మ, వేన్ పార్నెల్లను కూడా ఇదే ఏడాది అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ల్యూక్ పోమర్స్బాచ్, ఒక అమెరికన్ మహిళ దాఖలు చేసిన వేధింపుల ఆరోపణలతో దిల్లీలో ఇదే ఏడాది అరెస్టయ్యాడు.
2013 : శ్రీలంక ఆటగాళ్లపై నిషేధం
రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల నుంచి శ్రీలంక ఆటగాళ్లపై నిషేధం విధించారు. దీంతో పాటు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. కోహ్లి ఔటైన తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అంతే కాకుడా బీసీసీఐతో ఆర్థిక వివాదాల కారణంగా సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఐపీఎల్ నుంచి పూణె వారియర్స్ను ఉపసంహరించుకుంది.
2014 : ప్రీతి జింటా-నెస్ వాడియా రో
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా తన మాజీ ప్రియుడు, వ్యాపార భాగస్వామి నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో, మిచెల్ స్టార్క్, కీరన్ పొలార్డ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్టార్క్ బౌలింగ్లో ఉద్దేశపూర్వకంగా కవ్వించడం వల్ల, పొలార్డ్ బ్యాట్ విసిరాడు.