India US Drone Deal :భారత్కు 31 'ఎంక్యూ-9బీ' రకం సాయుధ డ్రోన్ల విక్రయానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.33 వేల కోట్ల ప్రతిపాదిత ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. కాగా, గతేడాది జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా పర్యటన సందర్భంగా ఈ డ్రోన్లకు ఒప్పందాన్ని ప్రకటించారు. 'రూ.33 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎంక్యూ-9బీ డ్రోన్లు, సంబంధిత పరికరాలను భారత్కు విక్రయించేందుకు ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది' అని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా- భారత్ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుందని అమెరికా ఏజెన్సీ పేర్కొంది. ఇండో-పసిఫిక్, దక్షిణాసియాలో ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం సాయం చేస్తుందని వివరించింది. కాగా, చట్టసభకు ఈ విషయాన్ని తెలియజేసేందుకు అవసరమైన పత్రాలను అందజేసినట్లు తెలిపింది.
యూఎస్-ఇండియా మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం భారత్కు రానున్న 31 డ్రోన్లను సీగార్డియన్ రకం డ్రోన్లుగా అధికారులు పేర్కొన్నారు. వీటిల్లో 15 డ్రోన్లను నౌకాదళానికి అప్పగించనున్నారు. ఆర్మీ, వాయుసేనకు ఎనిమిది చొప్పున కేటాయించనున్నారు.