Swiggy IRCTC : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ సేవలను మరింత విస్తరించేందకు మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా మార్చి 12 నుంచి విశాఖపట్నం, విజయవాడ సహా దేశంలోని మరో రెండు ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ సర్వీసులను అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఐఆర్సీటీసీతో మంగళవారం ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదుర్చుకుంది.
మరో 59 స్టేషన్లకు కూడా
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం సహా కర్ణాటక- బెంగళూరు, ఒడిశా- భువనేశ్వర్ నగరాల రైల్వే స్టేషన్లలోనూ ఈనెల 12 నుంచి ప్రయాణికులకు ఆన్లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తామని స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ వెల్లడించారు. కాగా, తమ సేవలను రానున్న రోజుల్లో దేశంలోని మరో 59 రైల్వే స్టేషన్లకు విస్తరిస్తామని స్విగ్గీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
'బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ మార్గాల్లో తిరిగే రైలు ప్రయాణికులు ఇకపై మార్చి 12 నుంచి మా పోర్టల్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లోనే తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మాకున్న విస్తృతమైన రెస్టారెంట్ల నెట్వర్క్ ద్వారా ఆయా స్టేషన్లకు చేరే ప్రయాణికులకు సమయానికి ఆహారాన్ని అందజేస్తాం. ఈ సేవలను మీరు ఆస్వాదిస్తూ మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా. మీ ఆశాజనకమైన ఫీడ్బ్యాక్ రాబోయే రోజుల్లో ఇలాంటి సేవలను మరిన్ని స్టేషన్లలో కూడా ప్రారంభించేందుకు మాకు ఉత్తేజాన్ని ఇస్తుంది' అని స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.