SDM Murder In Madhya Pradesh :ఎస్డీఎమ్గా పనిచేస్తున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. తనను ఇన్సురెన్స్, బ్యాంక్ ఖాతాల్లో నామినీగా చేర్చలేదని అంతమొందించాడు. అంతేకాకుండా ఆమె అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని డిండోరీ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది!
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, నిషా నాపిత్(51) అనే మహిళ శాహపుర ప్రాంతంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్గా విధులు నిర్వహిస్తోంది. ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచమైన మనీశ్ శర్మని(45) 2020లో పెళ్లి చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం నిషా నాపిత్కు ఛాతీలో నొప్పి వచ్చిందని ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లాడు మనీశ్ శర్మ. కానీ తన భార్య మార్గమధ్యలో మరణించిందని వైద్యులకు తెలిపాడు. శర్మపై వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులను అలర్ట్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకురావడానికి 5 గంటల ముందే ఊపిరాడక నిషా మృతిచెందిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో మనీశ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. తానే డబ్బుల కోసం హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు శర్మ.
శర్మ అల్లిన కట్టుకథ
అయితే వైద్యులు సమాచారం అందించిన తర్వాత పోలీసులు మనీశ్ శర్మను విచారించారు. అప్పుడు పోలీసులకు శర్మ ఓ కట్టుకథ చెప్పాడు. ఆదివారం మనీశ్ శర్మ, నిషాను ఆసుప్రతికి తీసుకొచ్చినప్పుడు తన భార్యకు కిడ్నీలలో ఒకటి పనిచేయటం లేదని చెప్పాడు. 'నా భార్య జలుబు, దగ్గుతో బాధపడింది. ఆమె ఉపవాసం కూడా ఉంది. ఈ సమయంలో కొన్ని పండ్లు తిన్న తర్వాత ఆమెకు వాంతులు అయ్యాయి. దీంతో ముక్కు నుంచి రక్తం కారింది. ఇంతలో మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఇంటి నుంచి బయటకు వెళ్లాను. కొద్ది సేపటి తర్వాత నేను తిరిగొచ్చేసరికి నా భార్య లేవడం లేదని పనిమనిషి చెప్పింది. అప్పుడు నేను వచ్చి నిషాను నిద్ర లేపడానికి ప్రయత్నించాను. కానీ ఆమె లేవలేదు. సీపీఆర్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఆసుప్రతికి తీసుకొళ్లాను. రక్తం అంటిన దుస్తులను వాషింగ్ మెషీన్లో ఉతికాను' అని శర్మ పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులకు శర్మ చెప్పిందేదీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మళ్లీ తమదైన శైలిలో శర్మను పోలీసులు విచారించారు. చివరకు శర్మ నిజం కక్కేశాడు.