Sadhguru Brain Surgery :ప్రముఖ ఆధ్యాత్మిక గురు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ మెదడు శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని దిల్లీ అపోలో వైద్యులు ప్రకటించారు. మెదడులో భారీగా వాపు రావటం సహా తీవ్ర రక్తస్రావం కావటం వల్ల అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఆయన కోలుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈనెల 17వ తేదీన జగ్గీ వాసుదేవ్కు మెదడు శస్త్రచికిత్స నిర్వహించినట్లు దిల్లీ అపోలో న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెప్పారు. సద్గురు ఆరోగ్య పరిస్థితి వైద్యుల అంచనాలకు మించి మెరుగుపడుతుందని చెప్పారు. ఈ మేరకు సద్గురు శస్త్ర చికిత్సకు సంబంధించి వినిత్ సూరి మాట్లాడిన వీడియోను అపోలో సంస్థ షేర్ చేసింది.
వైద్యుల సమాచారం ప్రకారం,జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాలుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన రోజువారీ సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. మార్చి 8వ తేదీన ఉత్సాహంగా మహా శివరాత్రి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మార్చి 15 నాటికి తలనొప్పి మరింత తీవ్రమైంది. అప్పుడు ఆయన అపోలో ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్, న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరిని ఫోన్లో సంప్రదించారు. ఆయన వెంటనే MRI స్కాన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. స్కానింగ్లో జగ్గీ మెదడులో రక్తస్రావం అయినట్లు వెల్లడైంది.
మందులను వాడుతూ, నొప్పితోనే మార్చి 15,16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సీటీ స్కాన్ తీయగా మెదడు వాపు మరింత ఎక్కువైనట్లు నిర్ధరణ అయింది. దీంతో వెంటనే శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు వైద్యులు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరారు సద్గురు. డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీ బృందం మార్చి 17వ తేదీన ఆయనకు అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేసింది. ప్రస్తుతం సద్గురు కోలుకుంటున్నారు.