Boat Capsizes In Odisha: ఒడిశాలోని మహానదిలో ఓ పడవ బోల్తా పడింది. ఝార్సుగూడ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 40 మంది ప్రయాణికులను రక్షించారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒడిశా ముఖ్యమంత్రి రూ. 4 లక్షల ఆర్థిక సాయన్ని ప్రకటించారు.
శుక్రవారం సాయంత్రం దాదాపు 50 మందికిపైగా ప్రయాణికులతో పథర్సేని కుడా నుంచి బర్గర్ జిల్లాలోని బంజిపాలి వెళ్తుండగా పడవ బోల్తా పడింది. వెంటనే గమనించిన స్థానిక మత్స్యకారులు నదిలోకి దూకి 35 మందిని కాపాడారు. తర్వాత పోలీసులు, సహాయక సిబ్బంది కొంతమందిని రక్షించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గల్లంతైన ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. అయితే ప్రయాణికులంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారు. పడవ సామర్థ్యానికి కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులను కాపాడిన మత్స్యకారులు తెలిపారు.
ఈ ఘటనలో మరణించినవారికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సురక్షితంగా బయటపడిన వారందరికీ సరైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఝార్సుగూడ జిల్లా పరిపాలన యంత్రాంగంతో ఈ ప్రమాదం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఝార్సుగూడ జిల్లా కలెక్టర్ కార్తికేయ గోయల్ ఘటనాస్థలిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 'ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వారిని రక్షించేందుకు భువనేశ్వర్ నుంచి స్కూబా డైవర్లు వస్తున్నారు. మరణించిన వారిలో 35 ఏళ్ల మహిళ ఉంది. గల్లంతైన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు' కలెక్టర్ తెలిపారు.