బియ్యం లారీ బ్రేకులు ఫెయిల్.. టోల్ప్లాజాపైకి దూసుకెళ్లి బీభత్సం.. లైవ్ వీడియో
Tamil Nadu truck hits toll plaza video : తమిళనాడు మధురైలో బ్రేకులు ఫెయిల్ అయిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. మస్తాన్పట్టి వద్ద టోల్ ప్లాజాపైకి లారీ దూసుకెళ్లింది. ఆపేందుకు ప్రయత్నించిన టోల్ ప్లాజా ఉద్యోగి సతీశ్ కుమార్ను లారీ ఢీకొట్టింది. అతడిని కొద్దిమీటర్ల వరకు లారీ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో సతీశ్ కుమార్ దుర్మరణం చెందాడు.
Madurai Masthanpatti toll plaza accident : పోలీసుల సమాచారం ప్రకారం.. బందికోయిల్ ప్రాంతంలోని ఓ వంతెన వద్దకు చేరుకోగానే బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల లారీ అదుపుతప్పింది. వాహనాన్ని ఆపేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టును ఢీకొట్టి లారీని ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ దగ్గర్లోనే పలు రెస్టారెంట్లు ఉండటం వల్ల అతడు వాహనాన్ని రోడ్డుపైనే పోనివ్వాల్సి వచ్చింది.
అనంతరం టోల్ ప్లాజా వద్దకు రాగానే.. అక్కడ లైన్లో పలు వాహనాలు కనిపించాయి. వాటిని తప్పించి ఎదురుగా ఉన్న టోల్ బూత్లవైపు లారీని పోనిచ్చాడు డ్రైవర్. ఈ క్రమంలోనే సతీశ్ను ఢీకొట్టాడు. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాతా లారీ వేగం తగ్గలేదు. ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. ఆ వాహనంలోని ఇద్దరు ప్రయాణికులు, టోల్ ప్లాజాలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. లారీ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి కేరళకు 30 టన్నుల బియ్యం లోడుతో వెళ్తోందని చెప్పారు. డ్రైవర్ కె.బాలకృష్ణ.. గుంటూరుకు చెందిన వ్యక్తి అని వెల్లడించారు.